ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదుగురు ఉగ్రవాదులు, 3 ప్రాంతాలు, 10 నిమిషాల కాల్పులు, 26 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 09:15 PM

యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నింపిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు.. టూరిస్ట్‌లు అధికంగా ఉన్న మూడు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారని.. ఆ తర్వాత 10 నిమిషాల పాటు భీకర కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘోరమైన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదులు దగ్గరికి వచ్చే వరకు అక్కడి పర్యాటకులు వారిని గుర్తించలేకపోవడం మరణాల సంఖ్య పెరగడానికి కారణం అయింది.


జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు, ఘటనాస్థలంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న బాధితులు చెబుతున్న విషయాలు చూస్తుంటే.. ప్రతీ భారతీయుడి గుండె రగిలిపోతోంది. మతం అడిగి మరీ ఒక్కొక్కరి వెంట పడిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి.. మొత్తంగా 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఇక ఇందులో 25 మంది భారతీయులు కాగా.. మరొకరు విదేశీ టూరిస్ట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పటికే పాక్‌పై భారత్ అనేక రకాల ఆంక్షలు విధించింది.


పహల్గామ్‌లో ఉగ్రదాడికి సంబంధించిన విషయాలు వింటుంటే హృదయాలు ద్రవించిపోతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. బైసరన్ లోయలో ఉల్లాసంగా సేదతీరుతున్న పర్యాటకులు.. ఈ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బైసరన్‌కు పక్కనే ఉన్న పైన్‌ అడవుల నుంచి దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు.. సైన్యం దుస్తులు వేసుకుని.. విశాలంగా ఉన్న లోయ ప్రాంతంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పర్యాటకులు అధికంగా ఉన్న 3 ప్రదేశాలను టార్గెట్ చేసుకుని.. అక్కడే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.50 సమయంలో మొదటి రౌండ్ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఆ తుపాకీ సౌండ్లు విని పర్యాటకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు.


 ఈ క్రమంలోనే.. అక్కడ ఉన్న పర్యాటకులను వారి పేరు, మతం అడిగి.. మరీ ముఖ్యంగా పురుషులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో చాలామంది పర్యాటకులను తలపైనే తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలనే అతి సమీపం నుంచి టూరిస్ట్‌లను కాల్చడంతో 10 నిమిషాల్లోనే 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన దారి గుండానే.. తిరిగి పైన్ అడవుల్లోకి పారిపోయారు. అయితే ఈ దాడి జరిగిన అరగంట తర్వాత అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు సమాచారం అందింది.


అయితే అప్పటివరకు కొందరు బాధితులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పహల్గామ్ నుంచి బైసరన్ లోయకు వెళ్లాలంటే కేవలం కాలినడక, గుర్రపు స్వారీ మాత్రమే ఉంది. కార్లు, వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం కావడంతో కొందరిని రక్షించలేకపోయారు. పూర్తిగా బురదతో కూడుకున్న నేలతో ఆ అటవీమార్గం చాలా దారుణంగా ఉంటుంది. దీంతో పహల్గామ్ నుంచి బైసరన్ లోయకు చేరుకునేందుకు కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. మృతుల్లో 25 మంది టూరిస్ట్‌లు, ఒక గుర్రపు స్వారీ ఆపరేటర్‌ ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa