జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడగా.. సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ సైతం వెంటనే తిరిగి వచ్చేశారు. ఇప్పటికే అధికారులతో దీనిపై చర్చలు కూడా జరిపి నిందితులను పట్టుకోవాలని సూచించారు. పహల్గావ్ దాడి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదన్న ఆయన.. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జమ్ము కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం రోజు మారణ హోమం సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ.. ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా.. 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా.. విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఉగ్రదాడి ఘటన గురించి సమాచారం అందుకున్న ప్రధాని మోదీ.. వెంటనే హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడటంతోపాటు.. సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని స్వదేశానికి వచ్చారు. అపై విమానాశ్రయం వద్దే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక బుధవారం రోజు సాయంత్రం రెండు గంటలకు పైగా క్యాబినేట్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలోని లోక్నాయక్ మార్గ్లో ఉన్న ప్రధాని మోదీ నివాసంలోనే ఈ సమావేశం జరగ్గా.. హోమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సీనియర్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నిందితులను త్వరలోనే పట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేచారు.
అయితే ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఈ ఘటనపై నోరు విప్పలేదు. కానీ ఉగ్రదాడి జరిగిన రెండ్రోజుల తర్వాత తొలిసారి స్పందించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ప్రసంగానికి ముందు పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. నిమిషం పాటు అక్కడున్న వారంతా మౌనం పాటించారు. ఆపై దాడి గురించి మాట్లాడుతూ.. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామన్నారు. అలాగే ఈ దాడి వల్ల అనేక మంది.. బిడ్డలు, భర్తలను కోల్పోయారని చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని.. ఇది కేవలం పర్యటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, భారత దేశంపై జరిగిన దాడని అభివర్ణించారు. అలాగే ఈ దాడికి పాల్పడ్డ వారితో పాటు, మద్దతు ఇచ్చిన వారందరినీ ట్రాక్ చేసి మరీ పట్టుకుంటామని.. శిక్షిస్తామని భారతీయులందరికీ హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. వీరికి పడబోయే శిక్ష ఎవరి ఊహకు కూడా అందదని పేర్కొన్నారు. బాధితులు అందరికీ న్యాయం చేసేందుకు అన్ని రకాలు ప్రయత్నిస్తామంటూనే.. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని మోదీ వివరించారు. అలాగే ఉగ్రమూకల వెన్నుమూకను 140 కోట్ల మంది భారతీయులు కలిసి విరిచేస్తారని గట్టిగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa