పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. దానిలో భాగంగా దశాబ్దాల క్రితం పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్.. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ కారణమని చెప్పకనే చెప్పింది. ఇండియా చర్యలతో పాక్ ఉడికిపోతోంది. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడాన్ని జలయుద్ధంగా పాక్ అభివర్ణించింది. సింధు జలాల్లో ప్రతి చుక్క నీటిపైన తమకు హక్కు ఉందని.. దాన్ని వదులుకోమని పాక్ విద్యుత్ శాఖ మంత్రి అవేస్ లెఘారి స్పష్టం చేశారు. ఆ వివరాలు..
భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం పట్ల పాకిస్తాన్ విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. ఇండియా నిర్ణయాన్ని "నిర్లక్ష్యపూరితమైన జల యుద్ధం"గా అభివర్ణించారు. ఇది పిరికిపంద చర్య అని, చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో ముడి పడి ఉన్న ఒప్పందం నుంచి.. ఇండియా ఏకపక్షంగా బయటకు రావడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. అలానే ప్రతి నీటి బొట్టుపై తమకు హక్కు ఉందని.. దాన్ని సాధించుకోవడం కోసం తాము న్యాయపరంగా, ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
సింధుజలాల ఒప్పందం.. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన స్థిరమైన అతికొద్ది ఒప్పందాలలో ఒకటని చెప్పొచ్చు. దీని ప్రకారం.. తూర్పు నదులైన బియాస్, రావి, సట్లజ్ జలాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే హక్కు భారతదేశానికి ఉండగా.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్కు నియంత్రణ ఉంటుంది. సింధు నదీ వ్యవస్థ ద్వారా వచ్చే నీటిలో దాదాపు 70 శాతం పాకిస్తాన్కు అందుతుంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగం 80 శాతం ఈ జలాలపైనే ఆధారపడి ఉంది. భారతదేశం తీసుకున్న తాజా నిర్ణయం.. పాకిస్తాన్ వ్యవసాయం, నీటి భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
భారత్ తీసుకున్న చర్యలపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే మంత్రి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న చర్యలు.. ఈ మారణకాండకు పాకిస్తాన్ను పరోక్షంగా బాధ్యురాలిగా చేస్తున్నట్లు సూచిస్తున్నాయి. అయితే ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఇటీవలి సంవత్సరాలలో కశ్మీర్లో జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడులలో ఒకటి. గురువారం బిహార్లో పర్యటించిన మోదీ.. ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు. టెర్రరిస్టుకు తాము కచ్చితంగా బుద్ది చెప్పి తీరుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa