జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘనటలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయపడ్డారు. ఈ దాడికి కారణం పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులేనని భారత బలగాలు ఇప్పటికే గుర్తించగా.. అది నిజమేనంటూ ఉగ్రసంస్థ "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" సంచలన ప్రకటన చేసింది. పహల్గాం ఉగ్రదాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు వివరించింది. అయితే తాజాగా మరో పోస్ట్ చేస్తూ.. కొన్ని గంటల్లోనే మాట మార్చింది. తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తులు ధరించి వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులకు తెగబడ్డారు. మొత్తంగా 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మరెంతో మంది గాయపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే పర్యటకుల సాయంతో ఉగ్రవాదుల ఊహా చిత్రాలు గీయించిన భద్రతా బలగాలు వాటిని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాయి. అలాగే వీరికి లష్కరే తోయిబాతో సంబంధం ఉందని కూడా గుర్తించారు. అమాయక ప్రజల ప్రాణాలు తీసిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఓవైపు పాక్ ఈ దాడితో తమకు సంబంధం లేదని చెబుతూనే.. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించింది. అమెరికా కోసమే తాము 30 ఏళ్లుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని కూడా పేర్కొంది. దీంతో ఆ దేశంపై పగ తీర్చుకునేందుకు భారత్ అనేక చర్యలు చేపట్టింది. ఇలాంటి ఉద్రిక్త సమయంలోనే పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" తామే పహల్గాంలో దాడికి పాల్పడ్డామని ప్రకటించింది. అయితే ఈ పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే మళ్లీ ఆర్టీఎఫ్ మాట మార్చింది. పహల్గాం దాడికి తమకు ఏ సంబంధం లేదని తేల్చి చెప్పింది.
అసలు ఆ 26 మందిని చంపింది మేము కాదని తాజాగా మరో పోస్ట్ పెడుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగానే భారత్ను బాధ్యురాలిని చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. భారత బలగాలే తమ వ్యవస్థల్ని హ్యాక్ చేసి.. తాము ప్రకటించిన విధంగా ఓ పోస్టు పెట్టాయని పేర్కొంది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా భారత సైబర్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ల పనేనని.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa