పహల్గామ్ ఉగ్రదాడి ఘటన భారత్-పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకోవడంతో, సరిహద్దు ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో తమను తాము రక్షించుకునేందుకు ప్రభుత్వ నిర్మిత బంకర్లలో తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.2021లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొంతకాలం ప్రశాంతంగా గడిచిందని, అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడితో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని స్థానికులు వాపోతున్నారు. గతంలో తరచూ వినిపించే 'కాల్పుల విరమణ' హెచ్చరికలు మళ్లీ మొదలయ్యాయని వారు చెబుతున్నారు.సరిహద్దుల నుంచి ఊహించని విధంగా కాల్పులు లేదా షెల్లింగ్ జరిగితే తలదాచుకునేందుకు వీలుగా, కొన్నేళ్లుగా ప్రభుత్వం నిర్మించిన బంకర్లను శుభ్రపరిచి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. "ఉద్రిక్తతల నడుమ బతుకుతున్నాం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మేము రక్షించుకోవడానికే ఈ బంకర్లను సిద్ధం చేసుకుంటున్నాం. పహల్గామ్ లాంటి దాడులను సహించబోం. ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఓ గ్రామ మాజీ సర్పంచ్ బల్బీర్ కౌర్ తెలిపారు.ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో గోధుమ పంట కోతలు జరుగుతున్నాయి. పురుషులు పంట పనుల్లో నిమగ్నమవ్వగా, మహిళలు బంకర్లను శుభ్రం చేసి, నివాసయోగ్యంగా మార్చే పనుల్లో నిమగ్నమయ్యారు. "మేం ఆయుధాలు లేని సైనికులం. శత్రువులను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి" అని సరిహద్దు వాసులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాము కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేస్తున్నారు.సరిహద్దు ప్రజల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2017లోనే పలు జిల్లాల్లో సుమారు 14,460 బంకర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మరో 4 వేల బంకర్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ బంకర్లే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa