జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జరిగిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడటంలో తాను విఫలమయ్యానని అన్నారు. ఈ దాడిలో మరణించిన 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర హోదా కోసం తాను డిమాండ్ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.పహల్గామ్ దాడిపై చర్చించేందుకు నేడు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ "గతంలో ఇలాంటి దాడులు చూశాం. కానీ, పహల్గామ్లోని బైసరన్లో ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం గత 21 ఏళ్లలో ఇదే మొదటిసారి. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణ చెప్పాలో కూడా తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పని నేను చేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరువయ్యాయి" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా వారిని కాపాడలేకపోయానని ఆయన అంగీకరించారు.రాష్ట్ర హోదా అంశంపై మాట్లాడుతూ, "పహల్గామ్ ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకుని నేను రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి నా రాజకీయాలు అంత చౌకబారువి కావు. మేము గతంలో రాష్ట్ర హోదా అడిగాం. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ సమయంలో, దానిని కారణంగా చూపి రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు" అని ఒమర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని జాతి తీవ్ర వేదనలో ఉన్నప్పుడు కాకుండా, మరో సందర్భంలో లేవనెత్తుతానని ఆయన తెలిపారు.ఉగ్రవాదంపై పోరులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఒమర్ అబ్దుల్లా నొక్కి చెప్పారు. "ప్రజలు మాకు మద్దతు ఇస్తేనే మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతమవుతాయి. మేము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలం. కానీ దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మాకు ప్రజల మద్దతు కచ్చితంగా అవసరం. ఈ ఉద్యమానికి హాని కలిగించేలా ఎవరూ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు" అని ఆయన అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa