జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయల్ మంగళవారం జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఉగ్రవాదుల మారణ హోమంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. పైగా ఉగ్రవాదులు పురుషులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ.. మతం అడిగి మరీ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు, బాధితులు వెల్లడించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడి చేసిన ముష్కరుల భరతం పట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు.. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా పట్టుకుని మట్టిలో కలిపేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ సింగర్పై దేశద్రోహం కేసు నమోదైంది.
జానపద సింగర్ అయిన నేహా సింగ్ రాథోడ్పై.. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద పోస్టులు పెట్టడంతో.. ఫిర్యాదులు అందగా.. ఆమెపై కేసు బుక్ చేశారు. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి.. నేహా సింగ్ రాథోడ్పై ఫిర్యాదు చేశాడు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలతోపాటు.. మతాల మధ్య చిచ్చు పెట్టేలా నేహా సింగ్ రాథోడ్ పోస్ట్లు ఉన్నాయని ఫిర్యాదులో ఆయన ఆరోపించారు.
నేహా సింగ్ రాథోడ్ ఎవరు?
నేహా సింగ్ రాథోడ్ బిహార్లోని జన్దాలో 1997లో పుట్టింది. ఆమె ఒక జానపద గాయని. భోజ్పురి పాటలను నేహా సింగ్ రాథోడ్ పాడుతుంది. అంతే కాకుండా ఆమె ఒక పొలిటికల్ సెటైరిస్ట్. 2018లో ఆమె కాన్పూర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టాను పొందింది. ఆ తర్వాత 2019లో భోజ్పురి పాటలు పాడడం మొదలు పెట్టి.. మొదట్లో సెల్ ఫోన్లో రికార్డ్ చేసి వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేది. అయితే భోజ్పురి కవులు బికారి థాకూరి, మహేందర్ మిస్రీలు తనకు స్ఫూర్తి అని నేహా సింగ్ రాథోడ్ చెప్పేది.
ఇక కరోనా సమయంలో 2020 మే నెలలో నేహా సింగ్ రాథోడ్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొవిడ్-19 వైరస్ గురించి బాగా ప్రచారం చేయడంతో ఆమె బాగా పాపులర్ అయింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో తన వీడియోలను షేర్ చేసేది. 2020 అక్టోబర్ నాటికి రాజకీయ విమర్శకురాలిగా నేహా సింగ్ రాథోడ్ గుర్తింపు తెచ్చుకుంది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛానల్కు లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చేశారు. బిహార్ మే కాబా, యూపీ మే కా బీ, యూపీ మే కాబా సీజన్ 2, ఎంపీ మే కాబా పాటలను నేహా సింగ్ రాథోడ్ పాడి.. మరింత పాపులర్ అయింది. అవన్నీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి. 2023 జూలైలో ఓ గిరిజన కార్మికుడిపై మూత్రం పోసిన వీడియోతో ఆమె ఒక వివాదంలో ఇరుక్కుంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి గురించి చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి చిక్కుల్లో పడింది. నేహా సింగ్ రాథోడ్పై భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు బుక్ చేశారు. లక్నోలోని హజ్రత్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa