ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్‌నాథ్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ.. పహల్గామ్ ఉగ్రదాడిపై రివేంజ్ ప్లాన్ ఏంటి?

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 10:32 PM

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గామ్‌లోని పరిస్థితులు, సైన్యం తీసుకున్న భద్రతా చర్యల గురించి ఆయనకు వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.


పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో సైన్యం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రక్షణ మంత్రి సోమవారం ప్రధానికి తెలియజేశారు. ప్రధానితో జరిగిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.


మరోవైపు రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సోమవారం సమావేశమయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరుగుతుందని సమాచారం. అటు, పహల్గామ్ దాడితో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్థాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. టర్కీకి చెందిన కొన్ని C-130 హెర్క్యులస్ విమానాలు పా‌క్‌లో ల్యాండయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన సామాగ్రిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.


పహల్గామ్ ఉగ్రదాడికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పాక్‌పై భారత్ అనేక ఆంక్షలు విధించగా.. అందుకు ప్రతిగా పాక్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ఆర్మీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.


ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "సిద్ధంగా.. అలర్ట్‌గా ఉన్నాం" అంటూ ఆ వీడియోను ఎక్స్‌లో పంచుకుంది. "మిషన్‌ రెడీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా. దేనికీ భయపడం. ఏదీ మమ్మల్ని ఆపదు. ఎల్లప్పుడూ సిద్ధంగానే.." అంటూ సైనికుల విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. అటు, పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలు చేసిన దాడికి ప్రతీకారంగా భారత్.. దాయాదిపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇప్పటికే నీటి కటకటతో అల్లాడిపోతున్న పాకిస్తాన్.. ఎడారిలా మారే పరిస్థితులు రానున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa