ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడికి ముందు రోజే పర్యటకులతో మాట్లాడిన ఉగ్రవాది

national |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 10:13 PM

పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన ఈ ఉగ్రదాడికి ముందు రోజు ఓ ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ఓ పర్యాటకుడు వెల్లడించాడు. అయితే ఆ ఉగ్రవాది సదరు పర్యాటకుడితో ఏం మాట్లాడాడు, పహల్గాం ప్రాంతం గురించి ఏం చెప్పాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుపై ఉన్నతాధికారులు చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రదాడికి ముష్కరులు ఎలా పన్నాగం పన్నారు, పర్యటకులు తప్పించుకోకుండా ఏమేం చేశారో మెళ్లి మెళ్లిగా తెలుస్తున్నాయి. స్థానిక కశ్మీరీల సాయంతోనే పక్కాగా ప్రణాళిక రచించి ఈ ఉగ్రదాడికి పాల్పడ్డట్టు అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మరో కీలక విషయం వెలుగు చూసింది.


ఉగ్రదాడి తర్వాత అధికారులు, కేంద్ర దర్యాప్తు బృందాలు, సైన్యం సంయుక్తంగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇవి చూసిన ఓ వ్యక్తి అందులోని ఓ ఉగ్రవాదిని గుర్తించి, ఆ విషయాన్ని అధికారులకు చెప్పారు. ముఖ్యంగా తన పేరు ఆదర్శ్ రౌత్ అని.. తాను మహారాష్ట్రకు చెందిన వాడు కాగా.. పర్యటన నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లినట్లు వివరించారు. అక్కడే ఉగ్రదాడికి ముందు రోజు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఆరోజు పహల్గాంలో రద్దీ తక్కువగా ఉందని ముష్కరుడు చెప్పినట్లు స్పష్టం చేశారు.


ఆ తర్వాతి రోజే ఉగ్రదాడి జరిగిందని ఆదర్శ్ రౌత్ పేర్కొన్నారు. ఎన్ఐఏ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన తర్వాత తాను ఆ ఉగ్రవాదిని పోల్చుకున్నానని.. తనతో మాట్లాడిన వ్యక్తి అతడే అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలతో జాతీయ దర్యాప్తు సంస్థకు మెయిల్ చేసినట్లు వివరించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆదర్శ్ రౌత్ ఈ వివరాలను వెల్లడించారు.


"ఏప్రిల్ 21వ తేదీన గుర్రపు స్వారీ కోసం పహల్గాంకు వెళ్లా. అక్కడ ఉన్న మ్యాగీ స్టాల్ వద్ద ఆహారం తినేందుకు ఆగాను. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి నువ్వు హిందువువా, కశ్మీర్‌కు చెందిన వ్యక్తిలా కనిపించడం లేదు అని అడిగాడు. ఆ తర్వాత అతడు నా పక్కన ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడాడు. ఈ రోజు రద్దీ తక్కువగా ఉందని ఆ వ్యక్తి మాతో చెప్పాడు. అతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో మాకెవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాతి రోజే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసిన తర్వాతే నాకు జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ రోజు మ్యాగీ స్టాల్ వద్ద డబ్బులు చెల్లించే సమయంలో నెట్‌వర్క్‌ సమస్య వచ్చింది. దీంతో అతడి నంబర్ తీసుకుని కిందకు వచ్చాక డబ్బులు చెల్లించాను. ఇలా నాకు గుర్తుకు వచ్చిన విషయాలు అన్నింటిని జాతీయ దర్యాప్తు సంస్థకు మెయిల్ చేశాను. అయితే అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. వారు సంప్రదిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను."


ఆదర్శ్ రౌత్‌తో మాట్లాడిన మరుసటి రోజే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. పర్యాటకుల సమీపానికి వచ్చిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఇందులో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని ఎన్ఐఏ గుర్తించింది. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించింది.. వీరికి మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa