వంగలపూడి అనిత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణలో చూపుతున్న చొరవ, బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.నిన్న వేకువజామున సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో మంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ మంత్రి అనిత పనితీరును ప్రశంసించారు.ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలోనైనా స్పందించడమే కాదు, శోకంలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చాలని, మంత్రి అనిత ఆ విధంగానే స్పందిస్తున్నారని కొనియాడారు. సింహాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున 3 గంటలకే ఘటన ప్రదేశానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు.మృతులు, క్షతగాత్రుల సంబంధీకులతో ఆమె మాట్లాడి ఓదార్చారన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి మంత్రి అనిత వెన్నంటి ఉండి మనోధైర్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి మంత్రి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణంగా నిలుస్తుందని పవన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa