ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలకూ తప్పని పహల్గామ్ ఉగ్రదాడి దెబ్బ

international |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 09:38 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుంది అని ఇప్పుడు ప్రతీ ఒక్క భారతీయుడితోపాటు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులను, వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌.. ఈ దాడికి పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని అంతా డిమాండ్ చేస్తున్నారు. పాక్‌తో యుద్ధం చేయాల్సిందేనని చాలా మంది మోదీ సర్కార్‌ను కోరుతున్నారు. పాక్ కవ్వింపులకు, ఉగ్ర కుట్రలకు బదులు తీర్చుకోవాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం యుద్ధంతోనే కాకుండా పాక్‌ను వీలైనన్ని రకాలుగా ఒత్తిడిలోకి నెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ దేశానికి నీళ్లు ఆపేసింది. వీసాలు ఆపేసి.. పాక్ జాతీయులను స్వదేశానికి వెళ్లగొట్టింది. అంతర్జాతీయంగా ఆ దేశానికి ఆర్థిక సహాయం అందకుండా చేస్తోంది. అంతేకాకుండా భారత్-పాక్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను మొత్తం నిలిపేసింది. దీంతో ఇప్పటికే ఆ దేశం దిక్కుతోచని స్థితిలో పడింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రసారంపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు, సినీ హీరోహీరోయిన్లకు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై భారత్‌ బ్లాక్ చేస్తోంది. ఈ లిస్ట్‌లో ఇప్పటికే పాక్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ వంటి వారు ఉన్నారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే మహిరా ఖాన్, హనియా అమీర్, ఫజల్ అలీ సహా అనేక మంది నటుల సోషల్ మీడియా అకౌంట్లను భారత్‌లో నిషేధం విధించారు.


ఈ క్రమంలోనే తాజాగా దాయాది దేశానికి మరో బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహజాబ్ షరీఫ్‌ యూట్యూబ్ ఛానెల్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా.. పాకిస్తాన్‌కు అనుకూలంగా వార్తలు, కథనాలను ప్రసారం చేస్తున్న 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లను తాజాగా భారత్ బ్లాక్ చేసింది. వీటన్నింటికి కలిసి 63 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం గమనార్హం. ఇందులో డాన్, జియో న్యూస్, బోల్ న్యూస్, సమా టీవీ వంటి మీడియా సంస్థలు, జర్నలిస్ట్ అస్మాషిరాజీకి వంటి యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి.


గతనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఈ దాడి చేసింది తామే అని మొదట ప్రకటించగా.. ఆ తర్వాత సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ దాడి చేసింది తాము కాదని పేర్కొన్నాయి. అయితే ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ప్రమేయం ఉందని.. భారత నిఘా సంస్థలు కనుగొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa