ఇన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ తమకు ఉగ్రవాదం అంటే ఏంటో కూడా తెలియదన్నట్లుగా మాటలు చెప్పుకుంటూ వచ్చింది. అందరికీ ఆ దేశం అసలు రూపం తెలిసినా.. వాళ్లు మాత్రం ఆ నిజాన్ని అస్సలే ఒప్పుకోలేరు. కానీ పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి.. అమెరికా, పశ్చిమ దేశాల కోసమే తాము 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఉగ్రవాదులతో తమకు సంబంధం ఉన్న విషయం వాస్తమేనని అంగీకరించారు. ఆ విషయం అందరికీ తెలిసిందేనంటూ సంచలనం రేపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో.. ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమ దేశంలో ఉగ్రవాదులే లేరని, కావాలనే తమపై భారత్ ఆరోపణలు చేస్తోందన్నారు. పహల్గాం జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్ను తప్పుగా ఆరోపిస్తున్నారంటూనే.. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలి లేదా భారతీయులా రక్తమైనా పారాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము గట్టిగా బదులు ఇస్తామని వెల్లడించారు.
ఇండియా తన నిర్ణయాన్ని ఏక పక్షంగా తీసుకుందంటూనే.. సింధు జలాలు ఎప్పటికీ మావేనని బిలావల్ భుట్టో ఉద్ఘాటించారు. ఇలా భారత దేశానికే గట్టి వార్నింగ్ ఇచ్చిన ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్కు సంబంధాలు నిజమేనంటూ వివరించారు. పాకిస్థాన్కు గతం ఉందనేది రహస్యం కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. దాని వల్ల తాము చాలా బాధ పడ్డామని, పాకిస్థాన్ దాని వల్ల చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఆ పరిణామాల నుంచి పాఠాలు కూడా నేర్చుకున్నామని అన్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు కూడా చేపట్టామని చెప్పారు.
ముఖ్యంగా పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది అని బిలావల్ భుట్లో వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా ముగిసిన అధ్యాయం అని.. అది తమ దేశ చరిత్రలో ఓ దురదృష్టకర భాగం అని వెల్లడించారు. ఇటీవలే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 'స్కై న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేశామని అన్నారు. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చారు. అది పొరబాటు చర్య అని ఆ తర్వాత అర్థమైందని అన్నారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే.. ఇప్పుడు తిరుగులేనని ట్రాక్ రికార్డ్ ఉండేదని అన్నారు. ఖవాజా ఇలా మాట్లాడిన వారంలోపే బిలావల్ భుట్లో ఉగ్రవాదంపై మాట్లాడతుండడంతో అంతా షాక్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa