ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నుంచి అడ్డదారుల్లో పెద్ద సంఖ్యలో లారీలు.. ఆరా తీస్తే అసలు కథ వెలుగులోకి

Crime |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 10:50 PM

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో లారీలు.. అడ్డదారుల్లో తెలంగాలోకి ప్రవేశిస్తున్నాయి. అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం..సన్న వడ్ల మీద క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మద్దతు ధరతోపాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తుండటంతో.. ఏపీ దళారులు దీనిపై కన్నేశారు.


ఆ రాష్ట్రంలో తక్కువ ధరకు సన్నవడ్లు కొని.. అడ్డదారిలో వాటిని తెలంగాణ ఐకేపీ సెంటర్లలో విక్రయిస్తు లాభాలు పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నల్లగొండ జిల్లా హాలియా మార్కెట్‌కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


ఓవైపు ఈ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు శుక్రవారం నాడు వాడపల్లి వద్ద అధికారులు ఏపీ నుంచి వచ్చిన 4 లారీలను సీజ్ చేశారు. వడ్ల అక్రమ రవాణాలను ముందే ఊహించిన ప్రభుత్వం.. ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. అయితే దళారులు.. అడ్డదారుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు అనుమానిస్తున్నారు.


ఇక ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కూడా అక్రమాలు జరగకుండా రైతుల ఆధార్, పాస్బుక్ వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. కానీ దళారులు, కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై వడ్లను నేరుగా మిల్లులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకోకపోతే తెలంగాణ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడంతోపాటు స్థానిక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.


తెలంగాణలో సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ. 2,320 మద్దతు ధర చెల్లిస్తుంది. దీనితో పాటుగా 500 రూపాయలు బోనస్‌ కూడా అదనంగా లభిస్తుంది. అంటే తెలంగాణలో క్వింటాల్ సన్న వడ్ల ధర రూ.2,820 అ. ఏపీలో వర్షాల కారణంగా వడ్లు తడిసిపోయాయి. ఇదే అదనుగా అక్కడ క్వింటాల్‌ వడ్లని కేవలం రూ.2వేలకే కొనుగోలు చేస్తున్న దళారులు ఆ లారీలను నేరుగా తెలంగాణ తరలించి వాటిని ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరికి ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు సహకరిస్తుండడంతో ఒక్కో క్వింటాల్ మీద రూ.820 చొప్పున అదనంగా లాభం చవిచూస్తున్నారు.


అక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం రైతుల ఆధార్‌కార్డులు, పాస్బుక్‌ల సాయంతో ట్రక్ షీట్లు అందజేయడమే కాక.. వడ్లు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను నేరుగా దళారుల అకౌంట్లలో పడేలా చేయడం కోసం.. ట్యాబ్ ఎంట్రీలో రైతులకు బదులు, దళారుల అకౌంట్ నంబర్లను ఎంటర్ చేస్తున్నట్లుగా తెలిసింది.


దళారులతో కుమ్మక్కైన మిల్లర్లు, అక్కడి నుంచి వచ్చే లారీలనే ముందుగా అన్‌లోడ్. దీనివల్ల తెలంగాణ రైతులు రోజుల తరబడి ఎదురు చూడడంతో పాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది. కనుక సివిల్ సప్లై అధికారులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa