ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు

business |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 11:57 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇప్పటివరకు 19 విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. 19వ విడతను 2025 ఫిబ్రవరి 24న విడుదల చేశారు. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఇందులో 2.4 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు. పీఎం-కిసాన్ పథకం 20వ విడత నగదు.. 2025 జూన్‌లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే.. 18వ విడత 2024 అక్టోబర్‌లో, 17వ విడత 2024 జూన్‌లో విడుదలైంది. ఈ లెక్కన చూస్తే జూన్‌లో 20వ విడత వచ్చే అవకాశం ఉంది.


ఈ-కేవైసీ తప్పనిసరి!


పీఎం-కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC - ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ మీరు ఇంకా ఈ-కేవైసీ చేసుకోకపోతే, వెంటనే పూర్తి చేయండి. లేకపోతే మీ తదుపరి విడత నిలిచిపోయే అవకాశం ఉంది.


ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలి?


పీఎం-కిసాన్ కోసం ఈ-కేవైసీ చేసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి వివరాల్ని నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణ ద్వారా ఇ- కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్‌తో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇదే సమయంలో పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో కూడా కేవైసీ చేసుకోవచ్చు.


అర్హులు ఎవరు?


వ్యవసాయ యోగ్యమైన భూమి తమ పేరు మీద ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. అయితే, కొన్ని వర్గాల వారు అనర్హులు. వీరిలో సంస్థాగత భూస్వాములు (ట్రస్టులు లేదా సంస్థల యాజమాన్యంలోని భూమి), ప్రభుత్వ ఉద్యోగులు (నాలుగో తరగతి, మల్టీ-టాస్కింగ్ సిబ్బంది మినహా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు), నిపుణులు (రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు), పన్ను చెల్లింపుదారులు (గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు) వస్తారు.


బెనిఫిషియరీ జాబితా, లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి..?


పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్' లేదా 'బెనిఫిషియరీ లిస్ట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.


'గెట్ డేటా' లేదా 'గెట్ రిపోర్ట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ స్టేటస్ లేదా లబ్ధిదారుల జాబితాను చూడవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa