కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమల అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వచ్చి ఆ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారు నెలవైన ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏడుకొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
మరోవైపు తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెం.604లో ఉన్న ఏపీ టూరిజం అథారిటికీ చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్భన్ సర్వే నెం.588-ఏ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయించేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి రూరల్ మండలంలోని సర్వే నెం.604లో ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ మండలంలోని సర్వే నెంబర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం రోజున తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం ఆరు గంటలు సమయం పట్టింది. మంగళవారం 69,214 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 26,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కానుకల ద్వారా శ్రీవారి హుండీకి మంగళవారం రూ. 3.27 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేసవి సెలవులు, వీకెండ్ కావటంతో గత రెండు మూడు రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక సమయం పట్టిన సంగతి తెలిసిందే. ఇక వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలోనూ మే నుంచి టీటీడీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa