ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ప్రయోగించిన 15 క్షిపణులను నిర్వీర్యం చేసిన భారత వాయుసేన

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 07:32 PM

పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల పొలాల్లో లభ్యమైన క్షిపణి శకలాలు ఎక్కడివన్నది తేలిపోయింది. అవి పాక్ ప్రయోగించగా, భారత్ వాటిని మార్గమధ్యంలోనే తుత్తునియలు చేసింది. భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్  ద్వారా సుమారు 15 పాక్ క్షిపణులను కూల్చివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం అనంతరం, పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో లాహోర్‌లోని కీలక రాడార్‌తో సహా పలు వ్యవస్థలు ధ్వంసమైనట్లు సమాచారం.వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం, భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న 'కదిలే లక్ష్యాల'ను పసిగట్టిన ఎస్-400 వ్యవస్థ, వాటిని విజయవంతంగా అడ్డుకుంది. దీని తర్వాత, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను అణచివేయడంలో ప్రసిద్ధి చెందిన హార్పీ డ్రోన్లను భారత్ రంగంలోకి దించింది. ఈ డ్రోన్లు శక్తివంతమైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లడమే కాకుండా, రేడియేషన్ వెలువరించే లక్ష్యాలను స్వయంగా గుర్తించి, వాటిపై దాడి చేయగల ప్రత్యేక నేవిగేషన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. నిర్దేశిత ప్రాంతంలోని లక్ష్యాలను ఏ దిశ నుంచైనా ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంది. పగలు, రాత్రి వేళల్లో సుమారు తొమ్మిది గంటల పాటు సుదూర లక్ష్యాలపై దాడులు చేయగలవని నిపుణులు చెబుతున్నారు.కాగా, భారత్ 'సుదర్శన చక్ర'గా అభివర్ణించే ఎస్-400 రక్షణ వ్యవస్థలు, ప్రపంచంలోనే అత్యంత ఆధునాతనమైనవిగా పేరుపొందాయి. ఇవి దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులను గుర్తించి, 400 కిలోమీటర్ల పరిధిలో వాటిని కూల్చివేయగలవు. ఈ తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన మరుసటి రోజే, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాలపై ఈ దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్  అభివృద్ధి చేసిన హార్పీ డ్రోన్లను భారత్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa