ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌-పాక్‌ టెన్షన్.. దేశంలో ఆహార నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 11:40 PM

భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. దేశ ప్రజల భద్రత, అవసరాల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని.. సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు కేంద్రం భరోసా ఇచ్చింది. పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తేల్చి చెప్పారు. దేశంలోని అన్ని నగరాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.


మరోవైపు.. దేశంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆహార కార్యదర్శులు, ఇతర కీలక వాటాదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచడం, నిల్వలను దాచడం వంటివి నివారించడానికి వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసినంది.


భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో సరిహద్దు జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా చండీగఢ్‌లో నిత్యావసర సరకుల నిల్వపై స్థానిక అధికారులు నిషేధం విధించారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని 3 రోజుల్లోపు ఆహార, సరఫరాల శాఖకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఉద్రిక్తతలు నెలకొంటున్న సమయంలో కొందరు వ్యాపారులు, సంస్థలు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


ఆందోళన చెందొద్దు, ప్రశాంతంగా ఉండండి: పంజాబ్ సీఎం


సరిహద్దు రాష్ట్రాల ప్రజలు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకుంటుండడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రశాంతంగా ఉండాలని సూచించారు. దేశంలో సరిపడా నిత్యావసరాల లభ్యత ఉందని, అక్రమ నిల్వలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో బారులు తీరడం, వంట గ్యాస్ సిలిండర్ లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిస్తే, తమకు సమాచారం ఇవ్వాలని భగవంత్ మాన్ సూచించారు.


ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు, క్షిపణుల దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది. పంచకుల, మొహాలీ, పటియాలా, అంబాలలోనూ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com