పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది. ఓవైపు దాయాది దేశానికి దౌత్య పరంగా చుక్కలు చూపిస్తూనే.. మరోవైపు మంగళవారం రోజు ఆపరేషన్ సిందూర్ పేరిట మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాక్ సైతం భారత్పై ప్రతిదాడులు చేస్తోంది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. మధ్య ప్రదేశ్ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ భారత ఆర్మీకి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధం అయింది. మొత్తంగా 7.5 లక్షల ట్రక్కులను సిద్ధం చేశామని.. వాటిని భద్రతా బలగాలకు అందిస్తామని పేర్కొంది.
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపగా మొత్తంగా 26 మంది చనిపోయారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముష్కరులను పట్టుకునేందుకు ఓవైపు వేట కొనసాగిస్తూనే.. అది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదుల పనేనని గుర్తించింది. ఈక్రమంలోనే దాయాది దేశంపై దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశ పౌరులను తిరిగి వారి దేశానికి పంపిస్తూ, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. అలాగే మన గగన తలంలోకి ఆదేశ విమానాలు రాకుండా చర్యలు చేపట్టింది.
మంగళవారం రోజు అర్దరాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత సర్కారు ప్రకటించింది. ఈ చర్యతో పాకిస్థాన్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దలు వెంబడి కాల్పులు జరుపుతూ అమాయక పౌరుల ప్రాణాలను తీస్తోంది. అలాగే భారత సైన్యం, బడులు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్, కాల్పులు జరుపుతోంది. వీటిని భారత్ దీటుగా అడ్డుకుంటూ ఆ దేశంపై దాడి చేస్తోంది. ఇలాంటి సయమంలోనే భారతీయులంతా ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. నిజమైన హీరోలంటూ వారి వెన్నంటే ఉంటున్నారు.
ముఖ్యంగా మధ్య ప్రదేశ్లోని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సుమారు 7.5 లక్షల ట్రక్కులను సైన్యానికి అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇండోర్లో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సీఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడుతూ.. భారత సైన్యానికి మధ్య ప్రదేశ్లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులను అందిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు వివరించారు. అలాగే ఆపరేషన్ సిందూర్తో దేశం మొత్తం గర్వపడాలని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రిజిస్టర్ చేసిన ట్రక్కులను ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధం చేసి ఉంటామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని వెల్లడించారు. అయితే తాము ఆర్మీకి ట్రక్కులను అందజేయడం ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా ఇచ్చినట్లు ముకాఠి తెలిపారు. ముఖ్యంగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో మొత్తంగా 1000 ట్రక్కులను మోవ్లోని ఆర్మీ కంటోన్మెంట్కు అప్పగించామని పేర్కొన్నారు.
![]() |
![]() |