ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ మద్దతు తెలిపిన 2 దేశాలకు బిగ్ షాకిచ్చిన భారత్.

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 11:45 PM

పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్‌బైజాన్ మాత్రం.. పాకిస్తాన్‌కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తూ.. అదే సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అజర్‌బైజాన్, టర్కీలకు బిగ్ షాక్ తగిలింది.


భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ప్రస్తుతం తలెత్తిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయాలకు తెర లేపాయి. పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్న దేశాలైన టర్కీ, అజర్‌బైజాన్‌లకు.. ఇప్పటి నుంచి కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. అంతేకాకుండా ఈ రెండు దేశాలకు అనవసరంగా వెళ్లే వారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని హితవు పలికాయి. ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాయి.


ఫేమస్ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ ‘కాక్స్ అండ్ కింగ్స్’ టర్కీ, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్‌లకు కొత్త బుకింగ్‌లను కొన్నిరోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అజర్‌బైజాన్, టర్కీ, ఉజ్బెకిస్తాన్ దేశాలకు అనవసరమైన ప్రయాణాలను ప్రస్తుతం విరమించుకోవాలని పేర్కొన్నారు.


మరోవైపు ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్‌ మై ట్రిప్ కూడా అచ్చం ఇలాంటి సూచనలే చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు మరింత అలర్ట్‌గా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించవద్దని హితవు పలికింది. ఈ రెండు దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే ముందే తాజా ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఈజ్‌ మై ట్రిప్ ఫౌండర్ నిషాంత్ ట్వీట్‌ చేశారు.


అదే సమయంలో ట్రావోమింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ కూడా టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ రెండు దేశాలకు చేసుకున్న బుకింగ్‌లు రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని ట్రావోమింట్ తేల్చి చెప్పింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఎమర్జెన్సీ ఫ్లైట్ బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.


మరోవైపు.. పాకిస్తాన్‌తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో కూడా పలు రాష్ట్రాల్లో హోటల్ బుకింగ్‌లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని హోటల్ బుకింగ్‌లను కస్టమర్లు భారీగా రద్దు చేసుకుంటున్నట్లు హోటల్ ప్రతినిధులు తెలిపారు. భద్రత దృష్ట్యా పర్యాటకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు భయపడుతుండటంతో బుకింగ్‌లు రద్దు అవుతున్నాయని పేర్కొంటున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్న దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్‌లు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com