హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఒకటి. కేపీహెచ్బీ ప్రాంతంలో అనేక షాపింగ్ మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు ఉండటంతో రద్దీగా ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నా.. కేపీహెచ్బీ ప్రాంతం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ముఖ్యంగా కూకట్పల్లి మెట్రో స్టేషన్, బస్టాండ్లలో దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. అక్కడి దారుణ పరిస్థితిని వివరిస్తూ.. ఓ యువకుడు హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్వీట్ చేశారు.
కేపీహెచ్బీ బస్టాండ్లలో కొందరు వ్యక్తులు ట్రాన్స్జెండర్లుగా చెప్పుకుంటూ యువకులను వేధిస్తున్నారని కంఫ్లైంట్ చేశాడు. అమాయకంగా, సిగ్గుగా ఉండే కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.10, రూ.20 ఇస్తే వినిపించుకోకుండా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని.. క్యూఆర్ కోడ్ ద్వారా రూ.100 ఆపైన యూపీఐ పేమెంట్ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా యువకులు ప్రతిఘటిస్తే.. వారిని బహిరంగంగా అసభ్య పదజాలలతో దూషిస్తూ, ప్రవర్తిస్తూ, వారి ముందే దుస్తులు విప్పేస్తామని బెదిరిస్తూ అవమానిస్తున్నారన్నారు.
దీంతో అమాయకపు యువత పరువు పోతుందనే భయంతో సైలెంట్గా వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇది చిన్న విషయంగా కొందరు భావించినా.. బాధితులు మాత్రం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, వారి ఆగడాలను తట్టుకోలేకపోతున్నారని.. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ ట్వీట్లో పోలీసులను యువకుడు కోరాడు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేపీహెచ్బీ బస్టాండ్ పరిసరాల్లో ట్రాన్స్జెండర్ల బారిన పడి ఇబ్బందులు పడిన వారు తమ బాధలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. 'మెున్న రూ.299 ఫోన్ రీఛార్జ్ చేసే దాకా వదల్లే. నేను స్టూడెంట్ నా దగ్గర డబ్బులు ఉండవ్ అని చెప్పినా వినలేదు. నిజంగా అక్కడ పరిస్థితి దారుణం.' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. మా ఫ్రెండ్ వద్ద కూడా రూ. 100 స్కాన్ చేయించుకున్నారని మరో నెటిజన్ వెల్లడించారు.
కాగా, గతంలోనూ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ల పేరుతో కొందరు వ్యక్తులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇలా డబ్బులు వసూలు చేసే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
![]() |
![]() |