గత నాలుగు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని, ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు భారత్ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, ఈ ప్రకటన వెలువడి కొద్దిసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. భూ, సముద్ర, గగనతలంలో కాల్పుల విరమణ అమల్లోకి రావాల్సి ఉండగా.. ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్లో డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. మే 12న దీనిపై ఇరు దేశాల అధికారులు సమావేశమైన ఓ అవగాహన ఒప్పందానికి రావాల్సి ఉంది.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి మాట్లాడుతూ, ‘భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటూ నిఘా నిర్వహిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాం,’ అని తెలిపారు. ‘ఈ సాయంత్రం భారత, పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య వచ్చిన అవగాహనను కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘిస్తోంది. ఇది ఈ రోజు వచ్చిన ఒప్పందానికి విరుద్ధంగా సాగుతుంది... ఈ ఉల్లంఘనలను భారత సైన్యం తగిన విధంగా ప్రతిస్పందిస్తోంది. ఈ చర్యలను మేము చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాం... పాకిస్థాన్ ఈ ఉల్లంఘనలపై బాధ్యతాయుతంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం.. ప్రస్తుత పరిస్థితిపై భారత సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయి.. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే, కఠినంగా స్పందించాలనే ఆదేశాలు వారికి జారీ అయ్యాయి... ధన్యవాదాలు’ అంటూ విక్రం మిస్రీ ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ డ్రోన్ కనింపించడం తీవ్ర కలకలం రేపింది. శ్రీనగర్లో పేలుళ్లు వినిపించినట్టు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసి.. కాల్పుల విరమణ లేనట్టేనని పేర్కొన్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు.. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్.. రాజస్తాన్లోని జైసల్మేర్, బర్మేర్లలో బ్లాక్అవుట్ విధించారు. గుజరాత్లోని కచ్లో డ్రోన్లు కలకలం రేపాయి. వాస్తవానికి పాకిస్థాన్ భారత్పై ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రకటన వచ్చింది.
అటు, ఆదివారం ఉదయం అమృత్సర్ డీసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రెడ్ అలర్ట్ కొనసాగుతోందని తెలిపారు ‘మీ సౌలభ్యం కోసం మేము విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాం.. కానీ మనం ఇంకా రెడ్ అలర్ట్లోనే ఉన్నాం. ఈ రెడ్ అలర్ట్ను సూచిస్తూ ఇప్పుడు సైరన్లు మోగుతాయి. దయచేసి మీ ఇంటి నుంచి బయటకు వెళ్లకండి; ఇంటి లోపల, కిటికీలు, బాల్కనీలకు దూరంగా ఉండండి. మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మేము మీకు తెలియజేస్తాం. దయచేసి సమ్మతిని నిర్ధారించుకోండి అయితే, ఎలాంటి భయాందోళనవద్దు’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa