ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన కాసేపటికే పాక్‌కు చైనా మద్దతు

international |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 08:08 PM

భారత్, పాకిస్థాన్ మధ్య శనివారం సాయంత్రం (మే 10) కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటల వ్యవధిలోనే నీరుగారిపోయింది. పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టింది. దాయాది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన విషయం తెలిసిందే. డ్రోన్లు కనిపించడంపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంగ్వీలు సోషల్ మీడియాలో స్పందించిన కొద్ది నిమిషాల్లోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్‌కు తమ మద్దతును ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఆంతర్యం ఏంటి? అనే చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ‘పాకిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్య్రాన్ని రక్షించడంలో బీజింగ్ మద్దతుగా ఉంటుంది’ అని ప్రకటించారు. ఈ సంభాషణ అనంతరం, పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్, భారత్ మధ్య మే 12న చర్చలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.


ఈ ప్రకటన ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ, ప్రాంతీయ పరిస్థితులపై ఇషాక్ దార్ చైనా విదేశాంగ మంత్రికి వివరించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..వాంగ్ యీ మాట్లాడుతూ ‘‘పాకిస్థాన్ చూపిన సంయమనం ప్రశంసనీయం.. కఠినమైన పరిస్థితుల్లో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని చైనా అభినందిస్తుంది’ అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించడం కూడా చైనా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం.


పాక్ విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం “పాక్‌ అన్నికాలాల్లోనూ వ్యూహాత్మక సహాయ భాగస్వామిగా, బలమైన మిత్రదేశంగా ఉన్న చైనా.. భవిష్యత్తులోనూ పాకిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రాన్ని రక్షించడంలో పూర్తిగా మద్దతు ఇస్తుందని’ వాంగ్ యీ హామీ ఇచ్చారు. అంతేగాక, ఇషాక్ దార్ టర్కీ విదేశాంగ మంత్రి హాకన్ ఫిడాన్‌తో కూడా మాట్లాడి, ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై ఆయనను కూడా వివరంగా సమాచారం ఇచ్చినట్లు సమాచారం.


పాక్ కాల్పుల ఉల్లంఘనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య కుదిరిన అవగాహనను పాకిస్తాన్ పునరావృతంగా ఉల్లంఘిస్తోందని, తక్కువ సమయంలోనే అవగాహనకు తూట్లు పొడిచిందని మండిపడింది .‘ఈ ఉల్లంఘనలపై సాయుధ దళాలు తగిన, గట్టిగా స్పందిస్తున్నాయి. మేము ఈ ఉల్లంఘనలను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నాం. పాకిస్థాన్ బాధ్యతాయుతంగా స్పందించి, పరిస్థితిని తీవ్రతతో ఎదుర్కోవాలని మేము కోరుతున్నాం’ అని పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa