దశాబ్ద కాలం నాటి ఎదురుచూపులకు తెరపడింది. గుంటూరు వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ.. నందివెలుగు ఆర్వోబీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు నగరవాసులకు ఉపశమనం కలిగించేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న గుంటూరు నగరవాసులకు ఊరట కలిగించేలా.. దశాబ్దకాలంగా ఊరిస్తున్న నందివెలుగు రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది. నందివెలుగు ఆర్వోబీ నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఈ టెండర్లను ఖరారు చేసింది. గుంటూరు - నందివెలుగు - తెనాలి మార్గంలో గుంటూరులో ఈ ఆర్వోబీ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పదేళ్ల కిందట ప్రకటించారు. గుంటూరు-హనుమాన్పాలెం వరకు 850 మీటర్ల పొడవుతో నిర్మించేందుకు 2014లో ఆమోదం తెలిపారు అయితే ఆర్థిక సమస్యల కారణంగా 2019 - 2024 మధ్య నందివెలుగు ఆర్వోబీ నిర్మాణ పనులు ఆగిపోయాయి.
అయితే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. పెమ్మసాని చొరవతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించనుంది. రూ.17 కోట్ల అంచనాతో నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులకు 2018లో శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. రైల్వే శాఖ షెడ్యూల్ ప్రకారం ముఖ్యమైన పనులు పూర్తి చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవటంతో ప్రాజెక్టు నత్తనడకన సాగుతూ వచ్చింది. దీంతో ఆర్వోబీ నిర్మాణం సగం వరకే పూర్తయ్యింది.
దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తెనాలి నుంచి వచ్చే కూరగాయల వ్యాపారులు సైతం ఇబ్బందులు పడ్డారు. దీంతో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వద్ద పలుసార్లు ప్రస్తావించారు. పెమ్మసాని చొరవతో ఇటీవల నందివెలుగు ఆర్వోబీ నిర్మాణ పనుల పునఃప్రారంభానికి రైల్వేశాఖ అంగీకరించింది. రూ.36 కోట్ల మేర నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. దీంతో నందివెలుగు ఆర్వోబీ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారు. తాజాగా రైల్వే అధికారులు టెండర్లను ఖరారు చేశారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నందివెలుగు ఆర్వోబీ పొడవు 850 మీటర్లు కాగా.. వెడల్పు 7.5 మీటర్లుగా ఉండనుంది. రెండు వరుసలుగా నిర్మించననున్నారు. అలాగే ఇరువైపులా కాలి నడకకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa