పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు వివరాలు వెల్లడిస్తోంది. రక్షణ శాఖ, విదేశాంగ శాఖలు, త్రివిధ దళాలు రోజూ మీడియా సమావేశం నిర్వహించి వివరిస్తున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. దాడులకు సంబంధించి పాక్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందులోని నిజానిజాలను ఏ రోజుకారోజు అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతో అసలు ప్రధాని మోదీ ఏ విషయంపై మాట్లాడనున్నారనే ఉత్కంఠ దేశ ప్రజల్లో నెలకొంది.
భారత్, పాక్ ఉద్రిక్తతల తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఏదైనా ప్రకటన చేస్తారా.. లేదా ఆపరేషన్ సిందూర్ గురించి ఏమైనా చెప్తారా.. అవన్నీ కాదంటే పాకిస్తాన్పై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు ఏమైనా చెప్తారా అనేది ఇప్పుడు దేశ ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఈనెల 10వ తేదీన మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపగా.. ఆ తర్వాత ఇరు దేశాలూ వాటిని ధృవీకరించాయి. ఈ క్రమంలోనే ఇవాళ భారత్, పాక్ డీజీఎంవోలు హాట్లైన్లో చర్చలు జరపనున్నారు. ఇందులో భారత్ తరఫున డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ అంగీకారం తర్వాత జరిగిన పరిణామాలు, పీవోకే అంశం, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై రెండు దేశాల డీజీఎంఓలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa