ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు పాక్‌ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం,,,,,చావుదెబ్బకొట్టిన భారత్

national |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 07:50 PM

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాదులు, వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్ సైన్యంపై భారత్ పోరాటం చేసిందని రక్షణ శాఖ వర్గాలు తాజాగా మరోసారి తేల్చి చెప్పాయి. మే 7వ తేదీన భారత సైన్యం చేసిన దాడుల్లో కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. ఎక్కడా సాధారణ పౌరులను టార్గెట్ చేయలేదని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ గడ్డపై భారత్ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఎ.కె భారతి, వైస్ అడ్మిరల్ ఎ.ఎన్ ప్రమోద్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.


పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని.. దీంతో ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైందని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణులతో భారత్‌పై పాకిస్తాన్ దాడులకు దిగినా.. మనకు ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్‌తో వాటన్నింటినీ పటాపంచలు చేసినట్లు తెలిపారు. పాక్ క్షిపణులు, డ్రోన్‌లను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వివరించారు. అదే సమయంలో భారత సైన్యానికి గానీ, ప్రజలకు గానీ పెద్దగా నష్టం జరగకుండా.. పాకిస్తాన్‌కు బాగా నష్టం కలిగించినట్లు తెలిపారు.


ఉగ్రవాదులకు పాక్ సైన్యం మద్దతు ఇచ్చిందని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు వివరించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే వారికి దీటైన జవాబు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై జరిపిన దాడులకు సంబంధించిన వీడియోలను అధికారులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది భారతీయులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం భారత్‌పై ఎలాంటి దాడులు జరిగినా వాటిని తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.


పాక్‌లో రెండు ఎయిర్ బేస్‌లు ధ్వంసం


పాకిస్తాన్‌పై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో రెండు ఎయిర్ బేస్‌లు ధ్వంసం అయినట్లు డిఫెన్స్ అధికారులు తెలిపారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తోపాటు, రహిమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌పైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు చేసినట్లు వివరించారు. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాకిస్తాన్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకున్నామని.. భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాష్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. పహల్గామ్‌లో అమాయక ప్రజలపై పాక్ దాడులకు తెగబడిందని.. అయితే తాము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ముందే సిద్ధం చేయడంతో అది బలమైన గోడలా నిలిచిందని వివరించారు.


త్రివిధ దళాల మధ్య సమన్వయం


పాకిస్తాన్‌పై దాడులు చేసిన సమయంలో భారత నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసినట్లు తెలిపారు. అయితే భారత్‌లో మోహరించిన మల్టీలెవల్ డిఫెన్స్ సిస్టమ్(బహుళ రక్షణ వ్యవస్థ)ను అధిగమించే శక్తి పాకిస్తాన్‌కు లేదని వెల్లడించారు. అత్యాధునిక రాడార్లతో కూడిన నిఘా వ్యవస్థ భారత్ సొంతమని.. గాల్లో ఎగిరే ప్రతిదాన్ని నిశితంగా గుర్తించే సామర్థ్యం వాటికి ఉందని స్పష్టం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యమని.. రేయి, పగలు నిఘా పెట్టగల సామర్థ్యం భారత పైలెట్లకు ఉందని వివరించారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను దాటుకుని భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేయలేకపోయిందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa