పొరుగు దేశం పాకిస్థాన్లో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 1:26 గంటలకు పాకిస్థాన్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలిపింది. తాజా భూకంపం వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.గత మూడు రోజుల్లో పాకిస్థాన్లో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. శనివారం కూడా పాకిస్థాన్లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. శనివారం ఉదయం 5.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం రాగా, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే 4.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.భూ ఉపరితలానికి సమీపంలో సంభవించే భూకంపాలు సాధారణంగా ఎక్కువ ప్రమాదకరమని భూగర్భ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి భూకంపాల వల్ల భూమి తీవ్రంగా కంపిస్తుందని, తద్వారా నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. శనివారం సంభవించిన భూకంపాలు ఈ కోవకు చెందినవేనని భావిస్తున్నారు.భౌగోళికంగా పాకిస్థాన్ అత్యంత క్రియాశీలకమైన ప్రాంతంలో ఉంది. భారత, యురేషియా టెక్టోనిక్ ఫలకాల సరిహద్దు సమీపంలో ఈ దేశం విస్తరించి ఉండటంతో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతాలలో పాకిస్థాన్ ఒకటి. ముఖ్యంగా దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిత్-బల్టిస్థాన్ వంటి ప్రావిన్సులు ప్రధాన భూకంప రేఖల వెంబడి ఉండటంతో అక్కడ భూప్రకంపనల ముప్పు ఎల్లప్పుడూ అధికంగానే ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa