ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఊసరవెల్లి...: బలోచ్ లిబరేషన్ ఆర్మీ

international |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 08:48 PM

పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ దేశాల మద్య తీవ్ర సైనిక ఘర్షణ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 18 రోజుల తర్వాత ఈ పరిస్థితులకు ఉద్వాసన పలుకుతూ.. ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఇలాంటి సమయంలోనే పాక్‌లోని బలోచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన కామెంట్లు చేసింది. ముఖ్యంగా భారత దేశాన్ని హెచ్చరిస్తూ.. పాక్‌తో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దాయాది దేశం ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుందని.. కాల్పులు విరమణ కూడా యుద్ధ వ్యూహంలో ఓ భాగమేనని వివరించింది. ఏమాత్రం ఆద మరిచినా.. పాకిస్థాన్ భారత్‌ను నాశనం చేసేందుకు చర్యలు చేపడుతుందని పేర్కొంది.


పహల్గాం ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భారత్.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ పని చేశారని గుర్తించింది. ఈక్రమంలోనే ఓవైపు దౌత్యపరంగా ఇబ్బందులు పెడుతూ మరోవైపు క్షిపణి దాడులు చేసింది. కేవలం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. పాక్ సైతం ప్రతిదాడులకు పాల్పడింది. ఇలా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా మే 10వ తేదీ రోజు కాల్పుల విరణకు అంగీకరించాయి. కానీ గంట కూడా కాకముందే పాకిస్థాన్ మళ్లీ కుక్కతోక వంకరే అన్నట్లుగా ప్రవర్తించి దాడులు చేసింది. విషయం గుర్తించిన భారత్ వెంటనే అప్రమత్తమై వాటిని అడ్డుకుంటూ గట్టిగా బదులిచ్చింది. ఇక ఆదివారం రోజు మళ్లీ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.


అయితే ఈ ఒప్పందంపై తాజాగా పాక్‌లోని బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్ ఊసరవెళ్లి మాటలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని చెప్పింది. పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర భావం ప్రవచనాలు అన్నీ మోసపూరితం అయినవేనని స్పష్టం చేసింది. ఇవన్నీ యుద్ధ వ్యూహంలో భాగమేనని.. తాత్కాలిక ఉపాయం కోసమే పాక్ ఇలా కాల్పుల విరమణకు ముందుకు వచ్చిందని హెచ్చరించింది. ఏమాత్రం ఆద మరిచినా, పాక్ మాటలు నమ్మినా భారత దేశం నట్టేట మునగక తప్పదని సూచించింది.


ఇదిలా ఉండగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ గత కొంత కాలంగా సొంత దేశమైన పాక్‌పైనే తిరగబడుతోంది. తమకు స్వాతంత్రం కావాలని, ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్నామని చెబుతోంది. పాక్ సైనికులపై దాడులు కూడా చేసి అనేక మందిని చంపింది. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తమకు సాయం చేయమని ప్రధాని మోదీని కూడా కోరింది. అయితే ఫారిన్ ప్రాక్సీ అంటూ తమపై వస్తున్న ఆరోపణను తాజాగా తోసిపుచ్చుతూ.. తామేమీ కీలు బొమ్మలం కాదని తేల్చి చెప్పింది. తమ ప్రాంతానికి చెందిన ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో తమకు సరైన స్థానం ఉందని వివరించింది. తమను తాము డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా కూడా అభివర్ణించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa