ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే రోజు వైసీపీకి వరుస షాకులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 07:35 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం వరుస షాకులు తగిలింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, అవంతి శ్రీనివాస్ వంటి నేతలతో పాటుగా.. ద్వితీయ శ్రేణి నేతలు సైతం వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిలో కొంతమంది కూటమి పార్టీల్లో చేరగా.. మరికొంతమంది క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా చాలా మంది వైసీపీని వీడారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరటంతో గుంటూరు, విశాఖపట్నం వంటి మేయర్ పదవులను, చాలా చోట్ల మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి.


ఇక ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీ తమ పదవులకు రాజీనామా చేయగా.. బుధవారం ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ జకియా ఖానం మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. జకియా ఖానం 2020 జులైలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం జకియా ఖానం బీజేపీలో చేరారు. అయితే జకియా ఖానం రాజీనామా మరువక ముందే మరో నేత వైసీపీకీ, మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జంజనం శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయిత శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ ఛైర్మన్ పదవికి ముందుగానే రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానానికి హాజరవ్వడానికి ముందు చీరాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జంజనం శ్రీనివాసరావు ప్రకటించారు.


 అనంతరం చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. టీడీపీ కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గం కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో బుధవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది అవిశ్వాసానికి అనుకూలంగా 26 ఓట్లు పడ్డాయి. మరోవైపు కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫిసియో సభ్యుల హోదాలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ ఓట్లు వేశారు. తీర్మానం నెగ్గడానికి అవసరమైన దానికంటే మూడు ఓట్లు అదనంగా వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa