ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి మహిళలకు భరణం ఇవ్వాల్సిందే..: ఢిల్లీ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 07:49 PM

బాగా చదువుకుని, గతంలో మంచి ఉద్యోగం చేసినా, ప్రస్తుతం ఉద్యోగం సంపాదించే అవకాశం ఉన్నా.. మహిళలు విడాకుల సమయంలో వారి భర్తల నుంచి తాత్కాలిక భరణం కోరడం సబబు కాదని ఢిల్లీ హైకోర్టు రెండు నెలల క్రితమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మనుషులు సోమరిగా ఉండడాన్ని చట్టం ఏమాత్రం ప్రోత్సహించదని తెలిపింది. ముఖ్యంగా ఓ మహిళ భర్త నుంచి తాత్కాలిక భరణం కావాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అయితే తాజాగా మరో కేసులో తీర్పునిస్తూ.. ఇందుకుపూర్తి భిన్నంగా మాట్లాడింది. భర్తల కంటే ఎక్కువ సంపాదించే శక్తి ఉన్నప్పటికీ.. పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలు మానేసిన భార్యలకు కచ్చితంగా భరణం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే ఓ భర్త కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. నెలనెలా భరణం చెల్లిస్తున్నానని.. అది చాలా కష్టంగా ఉందంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.


2016లో వివాహం చేసుకున్న ఓ జంటకు ఏడాదిలోపే ఓ కుమారుడు పుట్టాడు. అయితే 2017 నుంచే వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే తన భాగస్వామి తనను క్రూరంగా వేధిస్తున్నాడని.. ఆ మహిళ కోర్టుకు వెళ్లింది. భర్తకు విడాకులు ఇచ్చి తన కుమారుడితో కలిసి జీవించడానికి సిద్ధమని పేర్కొంది. ఇలా భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయంతో 2023లో కోర్టు వీరికి విడాకులు ఇప్పించింది. అయితే మధ్యంతర భరణం కింద.. భార్య, కుమారుడి పోషణ కోసం ప్రతినెలా డబ్బులు ఇవ్వాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా భార్యకు రూ.7,500, కుమారుడికి రూ.4,500 ఇవ్వాలని చెప్పింది.


ఇక అప్పటి నుంచి అతడు వీరిద్దరి పోషణ కోసం కోర్టు చెప్పిన డబ్బులను ఇస్తూ వస్తున్నాడు. అయితే 2023లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. తాజాగా ఆమె భర్త హైకోర్టుకు వెళ్లారు. తాను జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నానని.. నెలకు 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ఇందులో కుమారుడు, భార్య పోషణ కోసం నెలకు 12 వేలు ఇవ్వడం చాలా కష్టంగా ఉందని.. భార్య ఉన్నత విద్యార్హురాలని వివరించాడు. ఆమె కూడా ప్రస్తుతం సంపాదించుకుని బాబుని చూసుకోవచ్చని వెల్లడించాడు. బాబు పుట్టడానికి ముందు ఆమె నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు సంపాదించిందని చెప్పాడు.


అంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే ఆమెకు తనకు వచ్చే చాలీచాలని జీతంలో భరణం ఇవ్వలేనని.. కోర్టుకు విన్నవించాడు. అయితే భార్య తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. భర్త సంపాదించేది తక్కువే అయినా ఆస్తుల ద్వారా కూడా ఆదాయాలు పొందుతున్నాడని చెప్పారు. అలాగే భార్య ఉన్నత విద్యావంతురాలే అయినప్పటికీ.. కొడుకు పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేశారని వివరించారు. ప్రస్తుతం బాబు వయసు కేవలం 6 సంవత్సరాలేనని.. ఉద్యోగం కోసం వెళ్తే 12 గంటలకు పైగా బడిలోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల మధ్య ఏ తల్లి తన పిల్లలను చూసుకోలేదని వెల్లడించారు.


ఇదంతా విన్న న్యాయస్థానం.. మహిళతో మాట్లాడింది. రోజూ బడికి వెళ్లి రావడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుందని.. అలాగే పాఠశాలలో పూర్తిగా నిల్చొనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తానే పూర్తిగా అలిసిపోతున్నానని.. అలాంటి సమయంలో బాబును చూసుకోలేక ఉద్యోగం మానేసినట్లు వివరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పును ఇచ్చింది. మహిళ చెప్పిందంతా సహేతుకంగానే ఉందని.. ఆమెకు కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే భర్త భరణం చెల్లించాలని పేర్కొంది. సంపాదించే అవకాశం అంటే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా మహిళ ఉద్యోగం చేయకపోతేనే భరణం ఇవ్వకుండా ఉండడానికి అనుమతి ఇస్తామని కానీ ఈ కేసు అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పుకొచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa