ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు సగటు వ్యక్తి ఆదాయం పాక్ పౌరుడి కంటే మూడు రెట్లు ఎక్కువ

national |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 08:39 PM

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల కంటే ఆర్థికంగా బలంగా ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా వెలువడిన గణాంకాలు చూస్తే, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి  భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర జీడీపీ కంటే తక్కువేనని స్పష్టమవుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గత రెండు దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గణనీయంగా క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం, తమిళనాడు జీడీపీ పాకిస్తాన్ మొత్తం జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్థాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థిక ప్రగతిలో మాత్రం తమిళనాడుదే పైచేయి కావడం విశేషం. అంతేకాకుండా, తమిళనాడులో సగటు వ్యక్తి సంపాదన, పాకిస్థాన్‌లోని సగటు వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి.1995 నాటి గణాంకాలను పరిశీలిస్తే, తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, పాకిస్థాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే, 2025 నాటికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లకు సుమారు రూ. 35.8 లక్షల కోట్లు చేరుకోగా, పాకిస్థాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.9 లక్షల కోట్లు) వద్దే నిలిచిపోయింది.ఈ పరిణామాలపై నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ స్పందిస్తూ, "పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఇకనైనా ఉగ్రవాదాన్ని, కశ్మీర్ వివాదాన్ని పక్కనపెట్టి ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి కీలక రంగాలపై దృష్టి సారించాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది" అని హితవు పలికారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. భారతీయులు తమ దేశ ఆర్థిక ప్రగతి పట్ల గర్వాన్ని వ్యక్తం చేస్తూ, పాకిస్థాన్ పరిస్థితిపై విభిన్న రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. "ఒక్క కోయంబత్తూరు విమానాశ్రయ సమస్య తీరితే, ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్థాన్ జీడీపీని దాటేస్తుంది" అని ఒక యూజర్ పేర్కొనగా, "గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాకిస్థాన్ జీడీపీని అధిగమించాయి" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa