ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందే ప్రవేశించనున్నాయి. సాధారణ తేదీ అయిన జూన్ 4 కంటే నాలుగు నుంచి ఐదు రోజుల ముందే ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ తాజా అంచనాల్లో వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కన్యాకుమారి సహా దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది.అయితే, కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లోకి వాటి రాకపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా కేరళను జూన్ 1న తాకే నైరుతి, ఈ ఏడాది మే 27నే ప్రవేశించవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాల అధికారిక ప్రవేశాన్ని కేరళ రాకతోనే పరిగణిస్తారు.ఐఎండీ అమరావతి శాస్త్రవేత్త డాక్టర్ సగిలి కరుణాసాగర్ మాట్లాడుతూ, "కేరళలో మే 27న రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికి నాలుగు రోజులు అటూఇటూగా ఉండవచ్చు. ఈ అంచనా ప్రకారం, తుపాను ఆవర్తనాలు లేదా ఇతర వాతావరణ వ్యవస్థల అంతరాయాలు లేకపోతే, ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. మే 16న జారీ చేయనున్న మా దీర్ఘకాలిక వాతావరణ సూచనలో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది" అని వివరించారు.ఏప్రిల్లో ఐఎండీ విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గత ఏడాది, సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందుగా, జూన్ 2న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలో సగటు వర్షపాతం 521.6 మి.మీ కాగా, ఆ సీజన్లో 629.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa