కడప ఆర్మ్డ్ విభాగంలో అతడో ఏఆర్ కానిస్టేబుల్. ప్రేమ జంట కనిపిస్తే చాలు.. వారి ఫొటోలు తీసి, భయపెట్టి అందినకాడికి దోచుకోవడం అతడి నైజం. చివరికి అతని ఆగడాలు ఓ యువతి ప్రాణాలు తీశాయి. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడంతో సదరు కానిస్టేబుల్ను రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కడప జిల్లా పోలీసులు అతడిని విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... కడప ఆర్మ్డ్ విభాగంలో కే రామ్మోహన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తన సమీప బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో తనకు సహాయకుడిగా అనధికారికంగా నియమించుకున్నాడు. పాలకొండలకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమ జంటల ఫొటోలు తీయడం అనిల్ కుమార్ పని. అలాగే భయపెట్టి వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటాడు. అలా అతడు వారి నుంచి సేకరించిన వివరాలను రామ్మోహన్ రెడ్డికి పంపిస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి పేరెంట్స్కు చెబుతానని భయపెట్టి, అందినకాడికి దండుకునేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బీటెక్ విద్యార్థిని, ఆమె స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్ రెడ్డి వెళ్లి బెదిరించాడు. దాంతో విద్యార్థులు రూ.4వేలు ఇచ్చి, అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బెదిరింపులకు దిగడంతో మరో రూ. 10వేలు ఇచ్చారు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. యువతి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహన్రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ రామ్మోహన్రెడ్డిని కడప జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa