పాకిస్తాన్కు, పాక్ సైన్యానికి కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో యూట్యూబర్, ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారు పాకిస్తాన్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం పెను సంచలనంగా మారింది. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఈమె కమిషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్ వీసా సంపాదించి.. 2023లో ఆ దేశంలో సందర్శించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ పర్యటనలోనే ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లు గుర్తించారు.
జ్యోతి మల్హోత్రా స్వస్థలం హర్యానా అని విచారణలో తేలింది. ఇక భారత సమాచారం పాక్కు చేరుతున్నట్లు తెలియడంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో పనిచేసే డానిష్ను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి.. మే 13వ తేదీ దేశం నుంచి బహిష్కరించింది. అయితే జ్యోతి మల్హోత్రాను.. డానిష్.. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్కు పరిచయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డానిష్.. ఢిల్లీలో ఉన్న సమయంలో జ్యోతి మల్హోత్రా నిత్యం అతడిని కలవడం, మాట్లాడటంతో అనేక అనుమానాలకు తావిచ్చింది.
ఇక ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిసింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా.. భారత్కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్తో పంచుకున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే జ్యోతితోపాటు ఈ కేసులో పంజాబ్లోని మాలేర్కోట్లాకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమీన్ మొహమ్మద్, దేవిందర్ సింగ్ థిల్లాన్, అర్మాన్, బాను నస్రీనా అనే మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారని తేల్చారు. ఈ గూఢచార రాకెట్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక జ్యోతి మల్హోత్రా.. తాను చేసిన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa