ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు మీద పడేసిన బిడ్డను తెచ్చుకొని పెంచితే..బాయ్‌‌ఫ్రెండ్‌తో కలిసి తల్లినే చంపేసింది

Crime |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 07:49 PM

మంచికిపోతే చెడు ఎదురుకావడం అంటే ఇదే. తల్లిదండ్రులు వదిలేస్తేనో లేక.. ఇతర కారణాల వల్లనో తెలియదు.. రోడ్డు పక్కన పడి.. గుక్కపట్టి ఏడుస్తుంది మూడు రోజుల చిన్నారి. అది చూసిన ఆ మహిళ అయ్యో పాపం అనుకుంది. చిన్నారికి మంచి జీవితం ఇవ్వాలని భావించి.. జాలి పడి దత్తత తీసుకుంది. కడుపున పుట్టకపోయినా సరే.. కన్నబిడ్డలానే కడుపులో పెట్టుకుని పెంచింది. మరి మానవత్వంతో ఆలోచించిన ఆ మహిళకు చివరకు ఏం జరిగిందంటే.. జాలిపడి చేరదీసిన బిడ్డే.. నేడు ఏమాత్రం జాలిదయా లేకుండా ఆ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసింది. అది కూడా మగ స్నేహితులతో కలిసి. వెన్నులో వణుకు పుట్టించే ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ దారుణ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని భుబనేశ్వర్‌కు చెందిన జితేంద్ర కుమార్ పండ, రాజ్య లక్ష్మి భార్యా భర్తలు. దాదాపు 14 ఏళ్ల క్రితం వారికి రోడ్డు పక్కన ఓ పాప దొరికింది. అప్పటికే రాజ్యలక్ష్మి దంపతులకు పిల్లలు లేకపోవడంతో.. వారు ఆ చిన్నారిని పెంచుకోవాలని భావించారు. అధికారికంగా దత్తత తీసుకున్నారు. అయితే పాపను దత్తత తీసుకున్న మరుసటి ఏడాదే.. రాజ్యలక్ష్మి భర్త జితేంద్ర చనిపోయాడు.


భర్త చనిపోయానా బిడ్డను వదల్లేదు..


ఒంటరి మహిళగా మిగిలినప్పటకీ.. రాజ్యలక్ష్మి భయపడలేదు.. బిడ్డను వదులుకోలేదు. భర్త లేకపోయినా సరే.. అన్నీ తానై పాపను పెంచుతూ ఉంది. చిన్నారిని చదివించడం కోసం.. కొన్నాళ్ల క్రితం రాజ్యలక్ష్మి భుబనేశ్వర్ నుంచి పర్లాకిమిడికి వచ్చి.. అక్కడే నివాసం ఉంటుంది. బిడ్డను బాగా చదివించాలనే ఉద్దేశంతో.. కష్టపడి పని చేయసాగింది. అయితే తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని.. బాగా చదువుకోవాల్సింది పోయి.. ఆ బాలిక పిచ్చి వేషాలు వేయసాగింది.


ప్రస్తుతం ఆ బాలిక వయసు దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. అయితే గత కొన్ని రోజులుగా బాలిక ఎక్కువగా ఫోన్ వాడసాగింది. ఈ క్రమంలో ఆమెకు రథ్, సాహు అనే యువకులతో పరిచయం ఏర్పడింది. వయసులో వారు బాలిక కన్నాచాలా పెద్దవారు. పైగా వారికి బాలికతో పాటు.. రాజ్యలక్ష్మి ఆస్తి మీద కూడా కన్ను పడింది. బాలిక సాయం ద్వారా ఆమె పెంపుడు తల్లిని చంపితే.. ఆస్తితో పాటు అమ్మాయిని కూడా అనుభవించవచ్చనుకున్నారు.


బాలిక బ్రెయిన్ వాష్ చేసి..


దానిలో భాగంగా రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా బాలికకు చాడీలు చెప్పసాగారు. ఆమెని ట్రాప్ చేసి.. బాలిక బ్రెయిన్ వాష్ చేసి.. రాజ్యలక్ష్మికి ఎదురు తిరిగేలా చేశారు. చివరకు బాలికను ఆమె పెంపుడు తల్లిని చంపడానికి అంగీకరించేలా చేశారు. ఈ ముగ్గురు కలిసి రాజ్యలక్ష్మిని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. ఈ క్రమంలో సదరు బాలిక తనను పెంచింది అనే కృతజ్ఞత మరిచి.. ఆస్తి కోసం కన్న తల్లిలా చూసుకున్న రాజ్యలక్ష్మిని హత్య చేయడానికి రెడీ అయ్యింది.


ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 29న బాలిక.. రాజ్యలక్ష్మికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత.. బాలిక, ఆమె స్నేహితులు ముగ్గురు కలిసి రాజ్యలక్ష్మికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత బాలిక తన తల్లి లేవడం లేదని డ్రామా స్టార్ట్ చేసింది. ఇతర కుటుంబ సభ్యులను పిలిచి వారికి విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజ్యలక్ష్మి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గుండె పోటు కారణంగా ఆమె చనిపోయిందని అందరూ భావించారు.


అయితే, రాజ్యలక్ష్మి సోదరుడు సిబ ప్రసాద్ బాలిక ఫోన్ చెక్ చేయటంతో అసలు విషయం బయటపడింది. బాలికకు, ఆమె స్నేహితులకు మధ్య జరిగిన చాటింగ్‌లో రాజ్యలక్ష్మి ఇంట్లో ఉన్న 70తులాల బంగారం, నగదు గురించి వారి మధ్య చర్చకు వచ్చింది. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. మానవత్వం మరిచి కన్నతల్లిలా పెంచిన మహిళను చంపినందుకు.. ఆ బాలిక ఇప్పుడు జైల్లో మగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa