పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వాటితో.. భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులకు కూడా దిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఇదిలా ఉండగా కొందరు ఇంటి దొంగలు.. దాయాది దేశానికి అనుకూలంగా పని చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ.. మన దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై హరియాణా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..
అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దేవేంద్ర సింగ్ ధిల్లాన్ అనే యువకుడు.. పటియాలలోని ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేవేంద్ర సింగ్.. గతేడాది నవంబరులో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లి అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు దేవేంద్ర సింగ్కు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు.
పటియాలా మిలిటరీ కంటోన్మెంట్కు సంబంధించిన ఫొటోలను సైతం అతడు పాక్ అధికారులకు అందించినట్లు తెలిసింది. దేవేంద్రసింగ్ ఫోన్ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వేళ ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇలాంటి ఇంటి దొంగలు ఇంకా ఎంత మంది ఉన్నారో.. అంటున్నారు జనాలు.
కొన్ని రోజుల క్రితం పోలీసులు.. పాకిస్థాన్ ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయి విసిరిన హానీట్రాప్లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. దీంతోపాటు గగన్యాన్ ప్రాజెక్టు వివరాలను అందించినట్లు విచారణలో తేలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా కాంటాక్ట్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా విద్యార్థి ఇలాంటి కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa