మంచి వాళ్లనే ఆ దేవుడు ముందుగా తీసుకెళ్తాడని అంతా అంటుంటే వినడమే తప్పు చూసింది చాలా అరుదు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు చూడబోయే వార్త చూస్తే మాత్రం కచ్చితంగా ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడేందుకు వారంతా ఘటనా స్థలానికి చేరారు. అంబులెన్సుకు ఫోన్ చేసి మరీ వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆలోపే ఓ లారీ సాయం చేస్తున్న వారిపైకి దూసుకొచ్చింది. నేరుగా మనుషులపైకి ఎక్కేసింది. ఫలితంగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరినీ కూడా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు శనివారం రోజు స్థానికంగా జరిగిన ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు. అయితే వీరంతా కలిసి ఓ వ్యాన్లో వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. రాత్రి 11.30 గంటల సమయంపో పిండల్వాల్ హిలావాడి బస్టాండ్ సమీపానికి రాగానే.. ఉన్నట్టుండి వ్యాన్ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఓ పక్కకు పడిపోయింది. ఫలితంగా ఇందులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే అటుగా వెళ్లే వాళ్లంతా ఈ విషయం గుర్తించి వారికి సాయం చేసేందుకు వచ్చారు. వాహనాలు ఆపుకుని మరీ అందులో ఉన్న వాళ్లను బయటకు తీసుకు వచ్చారు. పెద్దగా గాయాలు కాలేవని గుర్తించినప్పటికీ.. వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు ఆగి ఆస్పత్రికి తరలించిన తర్వాతే వారు ఇళ్లకు వెళ్లాలనుకున్నారు.
అయితే ఇదే సమయంలో ఆ రోడ్డుపై ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. సహాయం చేస్తున్న వారి మీదకు ఎక్కేసింది. ఈ ప్రమాదంలో మూడు బైకులు లారీ కింద చిక్కుకోగా.. మొత్తంగా 12 మంది గాయపడ్డారు. అప్పటికే అంబులెన్సుకు ఫోన్ చేసి ఉండగా.. ముందుగా వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో నలుగురు ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు సాగిస్తున్నామని వివరించారు.
![]() |
![]() |