ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పెళ్లిళ్లన్నీ క్యాన్సిల్.. టర్కీకి వేల కోట్ల నష్టం

international |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:36 PM

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ దేశంపై భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించారు. మే 7,2025 రోజున భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. తమపై భారత్ దాడి చేసిందంటూ పాకిస్థాన్ చెప్పుకొంది. ఇందుకు టర్కీ వంతు పాడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వ్యాపారులు టర్కీ దేశంతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నారు. దీని ఫలితంగా టర్కీలో భారతీయ వివాహాల పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లనుంది. భారత పర్యాటకులు టర్కీకి వెళ్లడం తగ్గించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. CAIT ఆధ్వర్యంలో 80 మిలియన్ల వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.


సాధారణంగా ధనిక కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం టర్కీ వెళ్తుంటాయి. టర్కీలో జరిగే భారతీయ వివాహాలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా టర్కీ ఆర్థికంగా లాభపడుతోందని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది భారతీయులు టర్కీలో వివాహాలు చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీని వల్ల టర్కీలోని పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.


'భారతీయ వివాహాల కోసం టర్కీకి వెళ్లే పర్యాటకులు ఏటా 140 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యం' అని కేస్టోన్ ఉత్సవ్ సంస్థ సీనియర్ ప్రతినిధి నిఖిల్ మహాజన్ అన్నారు. 2024లో టర్కీలో 50 భారతీయ ధనిక కుటుంబాలకు చెందిన వివాహాలు జరిగాయి. ఒక్కో వివాహానికి సగటున 3 మిలియన్ డాలర్లు ఖర్చయింది. కొన్ని వివాహాలకు 8 మిలియన్ డాలర్ల వరకు సైతం ఖర్చు చేశారు. ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఇది స్థానిక వ్యాపారులకు, పర్యాటక రంగానికి చాలా ఉపయోగకరంగా ఉంది.


సాధారణంగా 100 మంది అతిథులతో కూడిన భారతీయ వివాహానికి 385,000 డాలర్లు ఖర్చవుతుంది. అదే టర్కీలో జరిగే సాధారణ వివాహానికి కేవలం 1,600 నుండి 5,400 డాలర్ల వరకు మాత్రమే ఖర్చు చేస్తారు. 2018లో టర్కీలో 13 భారతీయ వివాహాలు జరిగాయి. కానీ 2024 నాటికి వచ్చే సరికి ఆ సంఖ్య 50కి పెరిగింది. దీని ద్వారా టర్కీకి దాదాపు 150 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.


మే 2025లో 2000 పర్యాటక బుకింగ్‌లు రద్దయ్యాయి. అంతే కాకుండా జరగాల్సిన 50 భారతీయ వివాహాలలో 30 రద్దయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో వివాహం విలువ దాదాపు 3 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ రద్దుల వల్ల టర్కీ దాదాపు 90 మిలియన్ డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ వివాహాల వల్ల చాలా మంది స్థానిక వ్యాపారులు ఉపాధి పొందనున్నారు. పూల వ్యాపారులు, ఈవెంట్ మేనేజర్లు లాభపడతారు. అంతే కాకుండా, సెలబ్రిటీలు, ధనవంతులు ఈ వివాహాలకు హాజరవుతారు. ఇది టర్కీని ఒక విలాసవంతమైన ప్రదేశంగా నిలబెట్టడానికి సాయపడుతుంది.


టర్కీలో భారతీయ వివాహాలు ఎక్కువగా జరిగే సమయంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాధారణంగా టర్కీలో జరిగే భారతీయ వివాహాలలో 60 శాతం ఈ టైంలోనే జరుగుతుంటాయి. 2024లో టర్కీ వివాహ పర్యాటకం ద్వారా 3 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందులో భారతీయ వివాహాల ద్వారానే 3 శాతం ఆదాయం వచ్చింది. టర్కీ పర్యాటక రంగం గత సంవత్సరం 61.1 బిలియన్ డాలర్లు సంపాదించింది. ఇప్పుడు ఈ వివాదాల వల్ల ఆ రంగంపై ప్రభావం పడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com