ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సగం ధరకే ఫైటర్ జెట్లు,,,,పాకిస్తాన్‌కు చైనా మరో భారీ సాయం

international |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:40 PM

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరుతున్న వేళ.. చైనా తన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్‌కు భారీగా సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత అధునాతన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలైన జే-35ఏ డెలివరీలను మరింత వేగవంతం చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. రెండు దేశాలకు చెందిన దౌత్య వర్గాలు ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్‌కు చైనా బహుమతిగా అభివర్ణిస్తున్నాయి. ఈ నిర్ణయంతో పాక్, చైనా మధ్య రక్షణ సహకారం ఎంత అత్యవసరంగా మారిందో స్పష్టం చేస్తోంది. అయితే ఈ జే-35ఏ ఫైటర్ జెట్లను పాక్‌కు అందించేందుకు చైనా అనేక ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.


అయితే ఈ జే-35ఏ యుద్ధ విమానాలను 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో పాకిస్తాన్‌కు చైనా అందిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ మిగిలిన 50 శాతాన్ని కూడా ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు చైనా అంగీకరించడం గమనార్హం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చూపిన పనితీరుకు ఇది ఒక బహుమతిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాదిలోనే 30 జే-35ఏ యుద్ధ విమానాల మొదటి బ్యాచ్‌ను డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ నాటికి ఈ ఫైటర్ జెట్లు.. పాక్‌కు అందించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది.


ఇక ప్రస్తుతం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మొదటి 30 జే-35ఏ ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ అందుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత బలాన్ని చేకూర్చుకుంటున్న నేపథ్యంలో.. చైనా, పాకిస్తాన్ ఉన్నతాధికారుల మధ్య ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో భాగంగా సైనిక సహకారాన్ని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి.


మరోవైపు.. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఇప్పటికే కొంతమంది పైలట్లు.. జే-35ఏ ఫైటర్ జెట్లను నడిపేందుకు కావాల్సిన ట్రైనింగ్ కోసం బీజింగ్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం.. ఐదో తరం ఎయిర్‌ఫోర్స్ శక్తి సామర్థ్యాలను పొందడంలో పాకిస్తాన్ సాధించిన పురోగతి అని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫైటర్ జెట్ల ఒప్పందంతో పాటు.. చైనా అధికారులు పాకిస్తాన్ సివిల్, సైనిక మౌలిక సదుపాయాల్లో 25 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.


ఈ 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ఫేజ్-2 కార్యక్రమం కింద ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గ్వాదర్ పోర్ట్ కార్యకలాపాలకు పూర్తి భద్రతాపరమైన మద్దతు, సులభమైన యాక్సెస్‌ను చైనాకు అందిస్తామని పాకిస్తాన్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే.. చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక, ఆర్థిక సహకారం.. ప్రాంతీయంగా ఎదురయ్యే భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa