ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న రాహుల్ గాంధీ

international |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:44 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఆపరేషన్ సిందూర్‌పై లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పాకిస్తాన్‌తో దాడుల సందర్భంగా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్న పాక్ మీడియా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో వారి వాదనలకు బలం చేకూర్చేలా మరింత ప్రచారం ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్ దాడుల గురించి పాక్ ఆర్మీకి ముందే సమాచారం ఇచ్చారని జైశంకర్ చేసినట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. తీవ్ర దుమారానికి కారణం అయ్యారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వాదనను మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు.


ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పాకిస్తాన్ మీడియా బాగా హైలెట్ చేస్తూ.. సంబరపడిపోతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా భారీగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ఫెయిల్ అయిందని.. ఈ దాడుల్లో భారత్‌ను తాము ఓడించామని ఆ దేశం ప్రచారం చేసుకుంటోంది. భారత సైన్యం చేసిన దాడుల్లో ఎయిర్ బేస్ ధ్వంసం అయినా.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కోల్పోయినా పాక్ సైన్యం, ప్రభుత్వం మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కు చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని.. మరీ ముఖ్యంగా రఫేల్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ఇప్పటికే అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది.


అయితే ఓ వైపు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తోడవడంతో ఇప్పుడు పాక్ మీడియా మరింత రెచ్చిపోతోంది. భారత్‌కు చెందిన ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని ప్రశ్నించడంతో ఇప్పుడు ఆ ప్రశ్నను పాక్ మీడియా పండగ చేసుకుంటోంది. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా రాహుల్ గాంధీ ప్రశ్న ఉండడంతో పాక్ మీడియా ప్రత్యేక డిబేట్‌లను నిర్వహిస్తోంది.


ఆపరేషన్ సిందూర్‌ను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ సోమవారం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్.. ఆపరేషన్ సిందూర్‌ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అని ప్రశ్నించారు. భారత్ దాడి చేసే విషయాన్ని పాకిస్తాన్‌కు ముందే సమాచారం ఇవ్వడం నేరమని ఆరోపించారు.


అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత.. పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడటానికి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రమే స్పష్టతనిచ్చింది. ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత తాము ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని.. పాక్ ఆర్మీకి చెప్పినట్లు పేర్కొంది. అయితే పాక్ సైన్యం ఈ చర్యలకు దూరంగా ఉండాలని మాత్రమే సూచించామని.. కానీ వారు ఈ సలహాను పాటించలేదని జైశంకర్ చెప్పిన వీడియోను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa