ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమెకు 40, అతనికి 25.. కలిపిన ఇన్‌స్టా.. చివరికి

Crime |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:36 PM

చిన్న వయసులోనే పెళ్లి.. ఇద్దరు పిల్లలు పుట్టాక కొడుకు కంటే కాస్త వయసు ఎక్కువ ఉన్న యువకుడితో ప్రేమ.. కట్టుకున్నవాడిని, కడుపున పుట్టినవారిని కూడా వదిలేసి ప్రేమికుడి కోసం వచ్చేసింది.. 40 ఏళ్ల వయసులో పాతికేళ్ల యువకుణ్ని పెళ్లి చేసుకుంది.. కానీ, విధి ఆమె జీవితంతో వింత నాటకం ఆడింది.. ఆమె జీవితానికి అనుకోని ముగింపు ఇచ్చింది.. ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.


ఇన్‌‍స్టాగ్రామ్ పరిచయం వివాహితను తప్పుదారి పట్టించిందా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


విశాఖపట్నానికి చెందిన పద్మ వయసు 40 ఏళ్లు. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కూతురు ఉన్నారు. చక్కనైన కుటుంబం. చీకూ చింత లేని జీవితం. పద్మకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసే అలవాటు ఎక్కువ. ఈ క్రమంలోనే ఏడాది కిందట శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి పాతికేళ్ల సురేష్.. పద్మకు పరిచయమయ్యాడు. సురేష్ స్థానికంగా ఉండే మొబైల్ దుకాణంలో పనిచేస్తుంటాడు. పద్మ, సురేష్ మాటామాటా కలిశాయి. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న పద్మకు సురేష్ మాటతీరు నచ్చింది. అలా.. అలా సురేష్, పద్మ ప్రేమలో పడ్డారు. సురేష్ ప్రేమలో పద్మకు తాను చేస్తున్నది తప్పా, ఒప్పా అనేది కూడా తెలియలేదు. భర్త, పిల్లలు, కుటుంబం కన్నా సురేష్ తోడిదో లోకమనుకుంది.


భర్తను, ఎదిగిన పిల్లలను వదిలేసి.. ప్రియుని కోసం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది. అయితే భార్య కనిపించకుండా పోవటంతో పద్మ భర్త పోలీసులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీకాళహస్తి నుంచి పద్మను తిరిగి ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. కొన్నిరోజులు బాగానే గడిచింది. కానీ సురేష్‌తోనే జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్న పద్మ.. అదే విషయాన్ని లేఖ రాసి.. గత ఏడాది నవంబర్‌లో మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమలాడినా వినలేదు. ఆ తర్వాత పద్మ, సురేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే సురేష్ తల్లిదండ్రులు వీళ్ల వివాహానికి అభ్యంతరం చెప్పారు. దీంతో కైలాసగిరి కాలనీలో పద్మతో సురేష్ కాపురం పెట్టారు.


అయితే.. ఏం జరిగిందో తెలియదు.. మేన 22న పద్మ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సురేష్ ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. తాను కూడా మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. సురేష్‌ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల జనం శనివారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ పద్మ మృతదేహం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సురేష్‌ కనిపించారు. దీంతో సురేష్‌ను వెంటనే చికిత్స కోసం శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సురేష్ శనివారం రాత్రి చనిపోయాడు. పద్మ మృతిపై విశాఖలోని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. ఇద్దరి మృతిపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


మరోవైపు రోజూ అదే పనిగా టిఫిన్, భోజనాన్ని వృధా చేస్తోందని సురేష్ మందలించాడని.. దీంతో మాటామాటా పెరిగి మనస్తాపంతో పద్మ ఆత్మహత్య చేసుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పద్మకు చిన్న వయసులో పెళ్లి చేయడం కూడా ఆమె సురేష్ ఆకర్షణకు లొంగడానికి కారణం కావొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇన్‌స్టా పరిచయం.. రెండు కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చిందని అభిప్రాయపడుతున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు దూరమై ఓ కుటుంబం.. భార్య, తల్లి దూరమై మరో కుటుంబం.. ఇలా రెండు కుటుంబాల్లో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa