ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు

sports |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:42 PM

టోర్నీలో ఇప్పటివరకు పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు నేడు తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపరుగుల సునామీ సృష్టించారు. గుజరాత్ టైటాన్స్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (57), డెవాన్ కాన్వే (52) అద్భుత అర్ధసెంచరీలతో చెలరేగారు.తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3.4 ఓవర్ల వద్ద 44 పరుగుల వద్ద ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 34 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. డెవాన్ కాన్వేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, 9.2 ఓవర్ల వద్ద 107 పరుగుల వద్ద సాయి కిషోర్ బౌలింగ్‌లో శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఉర్విల్ పటేల్ ఔటయ్యాడు.ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (8 బంతుల్లో 17 పరుగులు; 2 సిక్సర్లు) కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. కానీ, షారుఖ్ ఖాన్ బౌలింగ్‌లో 12.3 ఓవర్ల వద్ద గెరాల్డ్ కోయిట్జీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్కోరు 144/3. కొద్ది సేపటికే, ధాటిగా ఆడుతున్న డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 13.3 ఓవర్లలో 156/4.ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టు స్కోరును అమాంతం పెంచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి బ్రెవిస్ ఔటయ్యాడు. మరోవైపు రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 పరుగులు; 1 ఫోర్, 1 సిక్సర్) అజేయంగా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పవర్‌ప్లేలో చెన్నై వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ తలో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్షద్ ఖాన్ 2 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నారు. గెరాల్డ్ కోయిట్జీ 3 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa