రష్యా మొత్తం 367 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 12 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి యూరీ ఇగ్నాత్ మాట్లాడుతూ, 2022లో పూర్తిస్థాయి దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ భూభాగంపై ఇంత పెద్ద సంఖ్యలో వైమానిక ఆయుధాలతో జరిగిన దాడి ఇదే అత్యంత భారీది అని ఆయన పేర్కొన్నారు.కీవ్ నగరంలోనే నలుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారు. డ్రోన్ శకలాలు పడి నివాస భవనాలు, ఒక వసతిగృహం దెబ్బతిన్నాయి. "నిద్రలేని రాత్రి తర్వాత ఉక్రెయిన్లో ఇది ఒక కష్టతరమైన ఆదివారం ఉదయం" అని విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో పోస్ట్ చేశారు. జైటోమిర్ ప్రాంతంలో 8, 12, 17 ఏళ్ల ముగ్గురు చిన్నారులు మరణించిన వారిలో ఉన్నారు. ఖ్మెల్నిట్స్కీలో నలుగురు, మైకోలైవ్లో ఒకరు మృతిచెందారని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మార్ఖలివ్కా గ్రామంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సాధారణ నగరాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోంది" అని రష్యాపై ఆరోపణలు గుప్పించారు. "రష్యా నాయకత్వంపై నిజంగా బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ క్రూరత్వాన్ని ఆపలేము" అని ఎక్స్లో పేర్కొన్నారు. కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa