కోనసీమ జిల్లా, ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. అది వడ్డే మహేష్గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారు వరకు ఫ్లడ్ లైట్లు.. గజ ఈత గాళ్ళు.. వలల సాయంతో అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్ళితే..... కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు హాజరయ్యారు. అందరూ సరదాగా వేడుకలో పాల్గొని విందు భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది మిత్రులు వెళ్లారు. బట్టలు, చెప్పులు, షూలు, సెల్ఫోన్లను ఒడ్డున పెట్టి స్నానానికి ఉపక్రమించారు. తొలుత ఒక యువకుడు స్నానానికి దిగాడు. ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయాడు. అది గ్రహించిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు. వారు కూడా మునిగిపోతుండడంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తరువాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్ (17), మేడిశెట్టి చరణ్రోహిత్ (20), కనికెళ్ల సురేష్ (19) సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కరుణకుమార్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజను పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa