ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ముగింపు ఉత్సవాలను భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ముగింపు వేడుక జరగనుంది. సుమారు 45 నిమిషాల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సాయుధ బలగాల సేవలకు గుర్తుగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా బీసీసీఐ ప్రతినిధి సైకియా మీడియాతో మాట్లాడుతూ, "‘ఆపరేషన్ సిందూర్’లో మన సాయుధ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవలకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. వారి వీరోచిత కృత్యాలు దేశానికి స్ఫూర్తినిస్తూ, మనల్ని కాపాడుతున్నాయి. వారికి నివాళిగా, ముగింపు వేడుకను సాయుధ బలగాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. క్రికెట్ మన దేశంలో ఒక మక్కువ కావచ్చు, కానీ దేశం, దాని సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రత కంటే ఏదీ గొప్పది కాదు. మన సాయుధ బలగాల పట్ల మేమెంతో గర్వపడుతున్నాం... వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని వివరించారు.ముగింపు వేడుకకు సాయుధ బలగాల సీనియర్ అధికారులను ఆహ్వానించినట్లు సైకియా తెలిపారు. మ్యాచ్ సమయంలో స్టేడియంలో కొన్ని స్టాండ్లను కూడా సాయుధ బలగాల సిబ్బందికి కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలను ఆలపించడంతో పాటు, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉంది. ఇది దేశ వీరులకు ఒక గంభీరమైన నివాళిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫినాలేకు ముందు ప్రముఖ గాయకులతో ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటన అనంతరం, మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ ఆపరేషన్ ద్వారా కచ్చితమైన దాడులు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు నిలిపివేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత, మే 17న టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైంది.ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా బీసీసీఐ భారత సాయుధ బలగాల సేవలను గుర్తించింది. పలు వేదికలలో మ్యాచ్లు ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లు జాతీయ గీతాన్ని ఆలపించారు. స్టేడియంలలోని జెయింట్ స్క్రీన్లపై ‘సాయుధ బలగాలకు ధన్యవాదాలు’ అనే సందేశాలను ప్రదర్శించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత కూడా బీసీసీఐ సాయుధ బలగాలను గౌరవించింది. ఆ ఏడాది ఐపీఎల్ ప్రారంభోత్సవానికి మిలిటరీ బ్యాండ్ను ఆహ్వానించడంతో పాటు, సాయుధ బలగాల సంక్షేమానికి రూ.20 కోట్లు విరాళంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa