ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మూర్ఖులు, జోకర్లు.. అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

national |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:43 PM

పహల్గా్మ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై మరోసారి అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. భారత్‌పై సైనిక విజయం సాధించినట్లు చెప్పుకునే ఫేక్ ఫోటోను ప్రదర్శించినందుకు షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లు మూర్ఖులు, జోకర్లుగా అభివర్ణించారు. చైనా సైనిక డ్రిల్స్‌కు సంబంధించిన ఫోటోను ఉపయోగించి.. ఫేక్ ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తోందని మండిపడ్డారు. ఏదైనా కాపీ చేయడానికి కూడా మెదడు కావాలి అంటూ వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్‌కు ప్రారంభించింది. అయితే ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్‌లో పాక్ సైన్యం విజయం సాధించిందని చెబుతూ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు ఒక ఫేక్ ఫోటోతో ఒక ఉన్నత స్థాయి కార్యక్రమం నిర్వహించారు. పాకిస్తాన్ సైనిక విజయాన్ని ప్రచారం చేసేందుకు ఆ ఫోటోను ఇటీవల ఆసిమ్ మునీర్.. షెహబాజ్ షరీఫ్‌కు అందించారు. దానిపై ఉన్న పెయింటింగ్ చైనా సైనిక డ్రిల్స్‌ను పోలి ఉండటంతో పాక్ చేసిన అబద్ధపు ప్రచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ మరోసారి మరో విషయంలో నవ్వుల పాలైంది. ఇక ఆ కార్యక్రమానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సహా పలువురు ఉన్నత రాజకీయ, సైనిక నాయకత్వం హాజరైనట్లు తెలుస్తోంది.


అయితే ఆ ఫోటోపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి.. ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు వెళ్లిన బృందంలో ఉన్న ఓవైసీ.. కువైట్‌ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు భారత్ నుంచి ఏదైనా కాపీ చేయడానికి మెదడు కావాలి అని పేర్కొన్నారు. ఆ ఇద్దరు మూర్ఖులు, జోకర్లు భారత్‌తో పోటీ పడాలని కోరుకుంటున్నారని అన్నారు. 2019లో జరిగిన చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను చూపించి.. దాన్ని భారత్‌పై విజయమని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఇలాంటి వాటిలో చాలా దిట్ట అని హేళన చేశారు. వారికి సరైన ఫోటోను బహుమతిగా ఇవ్వడం కూడా చేతకాదని విమర్శలు చేశారు.


తమ చిన్నతనంలో 'నకల్ కర్నే కే లియే అకల్ చాహియే' (కాపీ చేయడానికి కూడా తెలివితేటలు కావాలి) అనే మాట బాగా వినేవాళ్లమని.. అయితే పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌కు అని కూడా లేవని అసదుద్దీన్ ఓవైసీ వ్యంగ్యంగా అన్నారు. మే 15వ తేదీన పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్.. తమ దేశ వైమానిక దళాన్ని ప్రశంసించేందుకు బ్రిటన్ ఆధారిత న్యూస్ పేపర్ అయిన ది డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రికలో వచ్చిన ఒక ఫేక్ న్యూస్‌ను ప్రజలకు చూపించారు. పాకిస్తాన్ పార్లమెంటులో మాట్లాడిన ఇషాక్ దార్.. "పాకిస్తాన్ వైమానిక దళం: ఆకాశానికి వివాదాస్పద రాజు" అని అందులో కథనం వచ్చిందని దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ చూపించారు. పాకిస్తాన్ వైమానిక దళాన్ని.. నిపుణులు భయంకరమైన, గౌరవనీయమైన, అద్భుతంగా సమర్థవంతమైందని అభివర్ణించినట్లు ఉంది.


అయితే పాకిస్తాన్ వార్తాపత్రిక అయిన డాన్.. ది డైలీ టెలిగ్రాఫ్ పత్రికలో వచ్చిన వార్తపై ఫ్యాక్ట్ చెక్ చేసి.. అదంతా అబద్ధమని తేల్చింది. వైరల్ అయిన ఫోటోలో స్పెల్లింగ్ తప్పులు, గందరగోళంగా ఉన్న వాక్యాలు, భాషా లోపాలు వంటి అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిపింది. బ్రిటిష్ న్యూస్ పేపర్ ఫోటో ఫేక్ అని.. అసలు ఆ పత్రిక అలాంటి వార్తనే ప్రచురించలేదని డాన్ తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa