ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ బడి కోసం రూ.15 కోట్లు విరాళం.. వరల్డ్ క్లాస్ బిల్డింగ్

national |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:41 PM

జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా మనం నడిచి వచ్చిన మూలాలను మరిచిపోవద్దంటారు. అలా గుర్తు పెట్టుకున్న వారే మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పెద్దలంటారు. ఈమాటను పొల్లుపోకుండా పాటించారు ఇద్దరు సోదరులు . దీనిలో భాగంగానే తాము బాల్యంలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు ఖర్చు చేసి మరీ.. ఇంటర్నేషన్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. ఆ వివరాలు..


ఈ సంఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. తమకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి.. ఈరోజు ఇంతటి వాళ్లను చేసిన పాఠశాల.. నేడు శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని చూసి ఆ సోదరుల మనసు విలవిల్లాడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే పాఠశాల రూపురేఖలు మార్చే పనిలోకి దిగారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం వారు అక్షరాల 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారే రాజ్సమంత్ జిల్లా, శిషోదా గ్రామానికి చెందిన మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్. ఈ సోదరులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


శిశోదా గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్‌లు.. తమకు విద్యాబుద్దులు నేర్పిన కంకుబాయ్ సోహన్‌లాల్ ధాకడ్ గవర్నమెంట్ సీనియర్ సెకండరీ పాఠశాలని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి కుటుంబానికి చెబితే వారు కూడా అందుకు అంగీకరించారు. రంగంలోకి దిగిన సోదరులు.. ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. టాప్ కార్పొరేట్ స్కూల్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా దాన్ని అభివృద్ధి చేశారు.


ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలతో కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’నినాదానికి అనుగుణంగా ఇంత చక్కటి స్కూల్ బిల్డింగ్ నిర్మించిన సోదరులను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.


ఈ సందర్భంగా మేఘరాజ్‌, అజిత్‌ మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇకపై తమ గ్రామంలోని ప్రజలు నాణ్యమైన విద్య కోసం బయట ప్రాంతాలకు, లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాబోయే తరాలకు ఈ స్కూల్ మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నాము అన్నారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa