ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది

international |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 07:08 PM

అమెరికాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపాలు లేదా వాతావరణ సమస్యలతో కాకుండా, రెండు పావురాల కారణంగా ఒక విమానం రెండుసార్లు ఆలస్యమైంది. ఈ అనూహ్య సంఘటన ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మినియాపోలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ వింత ఘటనకు వేదికైంది.విస్కాన్సిన్‌కు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ 2348, మినియాపోలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ ప్రారంభించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు విమానంలోకి వస్తున్న క్రమంలో, ఒక పావురం క్యాబిన్‌లోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. దీనిని గమనించిన ఒక ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించారు.ఈ వింత పరిస్థితిపై పైలట్ మాట్లాడుతూ, తన అనుభవంలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారని ప్రయాణికులకు తెలిపారు. టామ్ కా అనే ప్రయాణికుడు ఈ దృశ్యాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఒక ప్రయాణికుడు తన జాకెట్‌తో పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది ప్రయాణికుల తలల పైనుంచి ఎగురుతూ కనిపించింది. చివరికి, ఎయిర్‌బస్ ఏ220 విమానంలోకి ప్రవేశించిన గ్రౌండ్ సిబ్బంది మొదటి పావురాన్ని సురక్షితంగా బయటకు పంపారు. దీంతో ప్రయాణికులు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. ఒక చిన్నారి ఆ పావురాన్ని ముట్టుకోవచ్చా అని కూడా అడిగింది.అయితే, కథ ఇక్కడితో ముగియలేదు. విమానం గేటు నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో, మరో పావురం క్యాబిన్‌లోకి ప్రవేశించింది. దీంతో విమానాన్ని మళ్లీ గేటు వద్దకు తీసుకురావాల్సి వచ్చింది. "ఇది క్యాబిన్‌లో ఎగురుతున్నప్పుడు నేను తీసిన వీడియో" అని కా పోస్ట్ చేశారు. "దానిని పట్టుకున్న తర్వాత మేము గేటుకు తిరిగి వచ్చాం. ఒక పావురం కారణంగా మళ్లీ వెనక్కి వస్తున్నామని పైలట్ కంట్రోల్ టవర్‌కు తెలిపారు. కంట్రోల్ టవర్ అధికారికి ఇది మొదటి అనుభవం కాగా, పైలట్‌కు ఆ రాత్రి అది రెండో పావురం" అని ఆయన వివరించారు.రెండోసారి కూడా బ్యాగేజీ హ్యాండ్లర్లు రంగంలోకి దిగి, రెండో పావురాన్ని కూడా పట్టుకుని బయటకు పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో రెండు పావురాలకు ఎలాంటి హాని జరగలేదని తెలిసింది.ఈ సంఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ స్పందించింది. విమానం నుంచి రెండు పక్షులను సురక్షితంగా తొలగించడంలో తమ సిబ్బంది, ప్రయాణికులు చూపిన జాగ్రత్తను అభినందిస్తున్నామని తెలిపింది. ప్రయాణంలో ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ పావురాల గందరగోళం కారణంగా విమానం మొత్తం 56 నిమిషాలు ఆలస్యమైందని ఎయిర్‌లైన్స్ ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది.ఫ్లైట్ అవేర్.కామ్ సమాచారం ప్రకారం, ఈ విమానం చివరికి 119 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో మాడిసన్‌కు సురక్షితంగా చేరుకుంది. "బహుశా పావురాలు ఎగరలేక, స్నాక్స్ కోసం విమానంలోకి వచ్చి ఉంటాయి. అయితే, మాడిసన్‌కు వెళ్లే ఈ చిన్న ప్రయాణంలో డెల్టా పానీయాలు/స్నాక్స్ అందించదని వాటికి తెలియదు" అని టామ్ కా సరదాగా వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa