ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ,,,సెల్ టవర్ ఎక్కిన టీడీపీ మహిళా నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 08:08 PM

కడపలో పసుపు పండగ టీడీపీ మహానాడు.. ఘనంగా జరుగుతుంది. రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మహానాడుకు హాజరయ్యారు. మహానాడులో నేడు (బుధవారం) రెండో రోజు కూడా ఘనంగా జరుగుతుంది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆయనకు నివాళి అర్పించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. లోకేష్ సహా పలువురు నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.


ఇదిలా ఉండగా ఓవైపు మహానాడు కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు కడప టీడీపీలో కలకలం రేగింది. జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత ఒకరు.. పార్టీలో తమకు అన్యాయం జరుగుతుందంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కడప ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని.. మహానాడుకు కనీసం తమకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..


ఓపక్క కడపలో టీడీపీ మహానాడు జరుగుతుండగా.. మరో వైపు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కడప టీడీపీ మాజీ అధ్యక్షురాలు చిప్పగిరి మీనాక్షి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. తమకు ఎలాంటి పదువులు రానివ్వకుండా అడ్డకోవడమే కాక.. దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నారంటూ మీనాక్షి.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు.


ఇక టీడీపీ మహిళ నేతా సెల్ టవర్ ఎక్కిందనే విషయం తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. ఆమెను కిందకు దించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి రాసిన లేఖ వైరల్‌గా మారింది. మీనాక్షి ఈ లేఖలో తన బాధను చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. సరే తాను మాత్రం టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌ల మీద అభిమానంతో పని చేశానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహానాడుకి తమకు ఆహ్వానం అందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.


పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి.. పార్టీని అమ్ముకుంటున్నవారికి మాధవి రెడ్డి అండదండలు పుష్కలంగా అందుతున్నాయన్నారు. పార్టీ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామన్నా.. ఆమె కోటరీ వారి ప్రయత్నాలను అడ్డుకుంటుందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్తులో పార్టీ ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాల్సిందిగా కోరుతున్నాను అంటూ మీనాక్షి లేఖలో రాసుకొచ్చింది. ఓ వైపు మహానాడు వైభవంగా జరుగుతుండగా.. మరోవైపు పార్టీ నేతల మధ్య కుమ్ములాటలు బయటపడటం స్థానికంగా కలకలం రేపుతుంది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa