బుడమేరు వరదల తాలూకు చేదు జ్ఞాపకాలు విజయవాడ నగర ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత సంవత్సరం కురిసిన కుండపోత వర్షాలకు బుడమేరు వాగుకు గండ్లు పడటంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా సింగ్ నగర్, చుట్టుపక్కల కాలనీలు నీట మునిగిన సంగతి విదితమే. లక్షలాది మంది నిరాశ్రయులై, పునరావాస కేంద్రాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆనాటి కష్టాలను తలుచుకుంటే ఇప్పటికీ స్థానికులు వణికిపోతున్నారు. భవిష్యత్తులో అలాంటి ఉపద్రవాన్ని ఎదుర్కొనే శక్తి తమకు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ భయానక పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. బుడమేరుకు పడిన మూడు ప్రధాన గండ్లను అత్యవసరంగా పూడ్చివేసి, వాటిని కలుపుతూ శాశ్వత పరిష్కారంగా రూ.23 కోట్ల వ్యయంతో కాంక్రీట్ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నిర్మాణ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని, వర్షాకాలం ప్రారంభమయ్యే లోగానే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు. పనులు వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పటిష్టమైన గోడ నిర్మాణం పూర్తయితే, భవిష్యత్తులో బుడమేరు వరదల నుంచి విజయవాడ నగరానికి రక్షణ లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa