మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులకు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ సరఫరా చేశారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఆ రైలులో అందించిన కూల్ డ్రింక్స్ సీసాలపై తయారీ తేదీ 2024 సెప్టెంబర్ 25గా ముద్రించి ఉండగా, వాటి గడువు తేదీ ఈ ఏడాది (2025) మార్చి 24తో ముగిసింది. దాదాపు రెండు నెలలకు పైగా గడువు తీరిన శీతల పానీయాలను ప్రయాణికులకు అందించినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై కొందరు ప్రయాణికులు రైలులోని క్యాటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటన స్థానిక మీడియాలో రావడంతో, కేరళ మానవ హక్కుల కమిషన్ దీనిని తీవ్రంగా పరిగణించింది. ప్రయాణికుల భద్రత, హక్కులకు సంబంధించిన అంశం కావడంతో తక్షణమే స్పందించి కేసు నమోదు చేసినట్లు కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పాలక్కాడ్లోని డివిజనల్ రైల్వే మేనేజర్కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ కేసును జూన్ 26న విచారణకు స్వీకరించనున్నట్లు మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa